Corona Restrictions : ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లయింది చైనాలో యాపిల్ ఐఫోన్ పరిస్థితి. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచం పుట్టి ముంచింది. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి దాన్ని తరిమికొట్టడానికి డ్రాగన్ కంట్రీ ఆంక్షలను కఠినతరం చేసింది. అవి ఇప్పటికీ ఆ దేశంలోని ఏవో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మిగతా దేశాలతో పోల్చితే చైనాలో ఈ ఆంక్షలు చాలా టఫ్. అందుకే వాటిని తట్టుకోలేక కొందరు ఐఫోన్ ఉద్యోగులు ప్రాణాలకు తెగించిమరీ ఎత్తైన ఫెన్సింగ్ పై నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కొందరు ఉద్యోగులు సొంతూళ్ల బాట పట్టారు. అధికారిక సమాచారం ప్రకారం జెంఝూలో ఉన్న కొవిడ్ కేసులు 264 మాత్రమే. అయినప్పటికీ ఆ మహమ్మారి మరింత విజృంభించకుండా అధికారులు నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.
తాజాగా ఈ ప్రభావం యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిపై పడిందంటోంది తయారీతోపాటు సరఫరాదారు సంస్థయిన
ఫాక్స్ కాన్. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. చైనాలోని జెంఝై ఫ్లాంట్ లో యాపిల్ ఫోన్ల ప్రొడక్షన్ దాదాపు 30 శాతం పడిపోయింది. ఈ ప్లాంట్ లో దాదాపు 2 లక్షల మంది పనిచేస్తున్నా ప్రొడక్షన్ పడిపోవడానికి కారణం కరోనా ఎఫెక్టే. ఫాక్స్ కాన్ యాజమాన్యం తమ ఉద్యోగులకు కొవిడ్ సోకకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. చివరికి అందరూ కలిసి భోజనం చేస్తే ముప్పు పెరుగుతుందనే ఉద్దేశంతో క్యాంటీన్ ను కూడా క్లోజ్ చేసింది. ఉద్యోగులంతా వారివారి డోమ్స్ లలో భోజనం చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
డిమాండ్ కు తగ్గట్లు సప్లై తగ్గిపోవడంతో ఫాక్స్ కాన్ ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు షెంజెన్ సిటీలోని మరో ఫ్యాక్టరీలో ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇక యాపిల్ ఐఫోన్ తయారీలో దాదాపు 70 శాతం ఫాక్స్ కాన్ చేపడుతోంది. అంతేకాదు కీలక సరఫరాదారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇయర్ ఎండ్ హాలిడే సీజన్ కావడంతో ఐఫోన్ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయనుంది. ఈ పరిణామాలపై మాట్లాడేందుకు యాపిల్ సుముఖత చూపడం లేదు.