Chocolates : పిల్లలన్నాక చిరుతిండి వైపే ఎక్కువ మొగ్గుచూపుతారు. వారు కోరిందివ్వకపోతే.. ఇల్లుపీకి పందిరేసేస్తారు. పిల్లల ఏడుపు చూడలేకనో, వారి గోల భరించలేకనో చేసేది లేక ఏది అడిగితే అది కొనిస్తుంటారు. అలా పిల్లలు మారాం చేసి మరీ కొనిపించుకునేవాటిలో చాక్లెట్స్ దే మొదటిస్థానం. ఇప్పుడు ఆ చాక్లెట్స్ తయారీకి సంబంధించిన ఓ వార్త అందరినీ కలవరపెడుతోంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో చిన్నారుల ప్రాణాలను లెక్క చేయకుండా.. అక్రమ సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కేటుగాళ్లు. హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా సాగిస్తున్నారు. అనూష్ ఇమ్లీ, క్యాండీ జెల్లీ పేరుతో కల్తీ చాక్లెట్లు తయారీ చేసి విక్రయిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించుకుండా.. దుర్గంధం వెదజల్లే స్థలంలో ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల నుంచి అనుమతి లేకుండానే యథేచ్చగా దందాను సాగిస్తున్నారు. పసి పిల్లల ప్రాణాలకు మీదకు తెస్తున్న కల్తీ చాక్లెట్ల తయారీపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. హైదరాబాద్లోని అనుస్ ఇమ్లీ పరిశ్రమపై పోలీసులు రెయిడ్ చేశారు అని వచ్చిన వార్తల్లో నిజం లేదని సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. డ్రైనేజి సమస్య ఉన్న మాట వాస్తవమే కానీ, రసాయనాలు వాడి చాక్లెట్స్ తయారు చేయడం లేదని అంటున్నారు. అసలు పోలీసుల రైడ్సే జరగలేదని చెప్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.