Kaleshwaram Project : తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం కలకలం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని ఆ పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ.. కాళేశ్వరం ఊసెత్తలేదు. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుపై ఏమీ మాట్లాడకపోవడం నాయకుల్ని సైతం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనికి తోడు మొన్నటికి మొన్న మేడిగడ్డను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపిస్తామని మాట్లాడారు. కేవలం 10 మినిషాల్లోనే సీబీఐ దిగుతుందన్నారు కిషన్రెడ్డి.
కాళేశ్వరంలో అవినీతిపై విచారణ జరపడానికి సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదన్నారు ఆ సంస్థ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్రావు. ఎందుకంటే.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్మిషన్లు వచ్చాయని గుర్తుచేశారు. ఆ నేపథ్యంలో సీబీఐ విచారణకు అడ్డంకులు లేవని వివరంగా చెప్పారాయన.
కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని స్పష్టంగా చెప్పారు. కేంద్రమే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని తెలిపారు. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణ కోరవచ్చని.. విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే.. అప్పుడు మాత్రమే రాష్ట్ర సర్కార్ అనుమతి అవసరం అన్నారు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్రావు.