Anand Mahindra : దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. సాధారణంగానే అక్కడ వాయుకాలుష్యం అధికంగా ఉంటుంది. దానికి తోడు ఢిల్లీకి పొరుగున ఉన్న రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో.. వాయుకాలుష్యం మరింత పెరిగి.. గాలిలో నాణ్యత క్షీణించింది. AQI 999వరకూ చేరడంతో ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వంతో పాటు.. వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో.. కేజ్రీవాల్ సర్కార్ మరో వారంరోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులను పొడిగించింది. కాగా.. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ.. ఎప్పుడూ తన ఆలోచనలను అభిప్రాయాలను పంచుకునే ఆనంద్ మహీంద్రా.. ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యాన్ని ఇలా తగ్గించండి అంటూ ఒక సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన X గా మార్చబడిన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. “పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడమే కాదు.. నేత ఉత్పాదకతను కూడా పెంచుతుంది. పంట వ్యర్థాలను తగులబెట్టడానికి బదులుగా ఈ ప్రత్యామ్నాయాన్ని పాటించడం లాభదాయకం” అని పేర్కొంటూ ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో పునరుత్పత్తి వ్యవసాయం ద్వారా కలిగే లాభాలను చూపించారు. కాగా.. దీపావళి మరుసటి రోజు నుంచి ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురానుంది.