Honour Killing : దేశంలో రోజురోజుకూ పరువుహత్యల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల తమిళనాడులో కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె తండ్రే.. ఆ నవదంపతులను పెళ్లైన మూడోరోజే దారుణంగా చంపించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను మరువక ముందే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో మరో పరువుహత్య వెలుగుచూసింది.
తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని.. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని కూతురు ఎదురుచెప్పడంతో ఆగ్రహించిన తల్లి.. ఆమెను అతి దారుణంగా చంపేసింది. అందుకు ఆమె కుమారుడు కూడా సహాయం చేయడం గమనార్హం.గార్లదిన్నె మండలం కోటంకలో జరిగిన ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. 17 ఏళ్ల యువతి గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడమే ఆమెపాలిట మరణశాసనమైంది. తల్లికూతుర్ల మధ్య తీవ్రమాటలయుద్ధం అనంతరం ఆమెను చంపి.. తల్లి, కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.