Telangana Elections 2023 : ఎన్నికలంటేనే ఒకరి మీద కోపంతో మరొకరి నామినేషన్లు వేస్తూనే ఉంటారు. కొందరు పార్టీ అభ్యర్థిగా, మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తూ తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇందులోనే భాగంగా తన పెద్ద కొడుకు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో 82 ఏళ్ల బామ్మ చివరకు నామినేషన్ వేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. 82 ఏళ్ల వయసు ఉన్న బామ్మ నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన శ్యామల స్వాతంత్య్ర సమరయోధుడు మురళీధర్ రావు భార్య. ప్రస్తుతం ఆమె జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. తమ కుటుంబానికి చెందిన ఇంటి విషయంలో తన పెద్ద కొడుకుతో వచ్చిన విబేధాల కారణంగా తాను నామినేషన్ వేయాల్సి వచ్చిందని శ్యామల వివరించారు. పెద్ద కొడుకు రామారావు కోర్టును ఆశ్రయించడంతో ఇంట్లో నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే వృద్ధాప్యానికి చేరుకున్న తానిప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కనీసం తన బాగోగులు కూడా పెద్ద కొడుకు చూసుకోవడం లేదని శ్యామల ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని దేశంలోని ప్రముఖలందరికీ వినతి పత్రాలు పంపించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
82 ఏళ్ల వయసుకు వచ్చిన తనపట్ల చూపుతున్న వివక్ష సరికాదని తన గోడు సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే జగిత్యాలలో నామినేషన్ వేశానన్నారు. తన పెద్ద కొడుకు వల్ల జరిగిన అన్యాయాన్ని సవరించి తన ఇంటిని తనకు ఇప్పించాలని కూడా కోరుతున్నారు.