AP Police : ప్రజా స్వామ్యానికి తల వంపులు తెచ్చేలా ప్రవర్తించారు ఏపీ పోలీసులు. ఏకంగా మహిళా కానిస్టేబుల్తో సహా నలుగురు పోలీసులు ఆర్మీ ఉద్యోగిపై దండయాత్ర చేశారు. గంటకు పైగా వందలాది మంది చూస్తుండగా సైనికొద్యోగికి పరవాడ పోలీసులు చుక్కలు చూపించారు. విశాఖపట్నంలోని పరవాడ సంతలో జరిగిన ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. పరవాడ పోలీసులు దిశ సబ్స్క్రిప్షన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మహిళల రక్షణకు నిద్దేశించిన ఈ యాప్ను అందరి ఫోన్లో ఇన్ స్టాల్ చేసేందుకు ఓ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నం ఘర్షణ కు కారణమైంది.
సయ్యద్ అలీముల్లా దువ్వాడలో సెక్టార్ 10లో నివసిస్తూ జమ్మూ కాశ్మీర్ లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్ గా పనిచేస్తున్నాడు. సెలవుపై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబయల బస్టాప్ లో వేచి ఉన్నాడు. ఆయన వద్దకెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని దిశ యాప్ డౌన్లోడ్ చేసింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఫోన్కొచ్చిన వన్టైం పాస్వర్డ్ చెప్పాలని కానిస్టేబుల్ పట్టుబట్టడంతో ససేమిరా అన్నాడు. పాస్వర్డ్ను తానే ఎంటర్ చేస్తాననడంతో పాటు నేమ్ ప్లేట్ లేనందున గుర్తింపు కార్డు చూపితే ఓటీపీ చెబుతాననడంతో చిర్రెత్తుకొచ్చిన మహిళా కానిస్టేబుల్ అతడిపై చేయి చేసుకుంది.
దీంతో నిర్ఘాంతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశా యాప్ ఎందుకని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. స్థానికులు ఆయనకు సపోర్ట్ చేయడంతో పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ స్టేషన్ కి ఫోన్ చేశాడు. నలుగురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు అటోలో చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కనుక్కోకుండానే అమాంతం అతని మీదపడి దాడి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సీపీ నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపారు.
దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు ఏపీకి వస్తే.. ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని లోకేశ్ విమర్శించారు.