PM Modi : తెలంగాణ కురుక్షేత్రంలో విజయకేతనం ఎగురువేసేందుకు.. అధికార పీఠం దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ టార్గెట్గా ప్రతిపక్ష నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు . బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో విపక్షాలకు మేడిగడ్డ కుంగుబాటు ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. ఏ చిన్న అవకాశం దొరికినా కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఎలక్షన్ ప్రచారంలో మేడిగడ్డ ఊసు ఎత్తకుండా మౌనం వహించడం పొలిటికల్గా చర్చకు దారి తీసింది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి . ఈ మేరకు బీసీ మంత్రం జపిస్తున్న కమలనాథులు.. పెద్ద ఎత్తున బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. మేడిగడ్డ వ్యవహారం పొలిటికల్ దూమారం రేపుతున్న సమయంలో.. మోదీ తన ప్రసంగంలో దాని గురించి ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కాంగ్రెస్కు ఈ పరిణామం మరింత కలిసొచ్చింది.
ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్లు ఒకటేనంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది . ఇది వరకే ఈ అంశంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి పట్ల మోదీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు రక్షణ కవచంగా ఉంటున్నారని, అందువల్లనే ఎంతటి అవినీతి జరిగినా దానిపై యాక్షన్ ఉండదని ఆరోపించారు. వీరిద్దరూ లోపాయికారీగా పరస్పరం సహకరించుకుంటున్నారని, అందువల్లనే కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేసులు, ఎఫ్ఐఆర్లు ఉండవన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ అధికారుల సోదాలూ, తనిఖీలు కూడా ఉండవంటూ ఫైర్ అయ్యారు.
మరో నేత టీపీసీసీ చీఫ్ రేవంత్ తెలంగాణ పర్యటనలో మేడిగడ్డను సందర్శించి కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని ప్రధానికి సవాల్ విసిరారు. ఈ స్థాయిలో దుమారం రేపుతున్న అంశంపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనం వహించడంతో కేసీఆర్, మోడీ ఒక్కటేననే సంకేతాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీంతో మోదీ సభ సక్సెస్ అవడమేమో కానీ.. మైనస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది.