Blackmail | ఇంట్లో పనిమనిషి కావాలని ఒక వ్యక్తి వర్కర్లను సప్లై చేసే కన్సల్టెన్సీలో చెప్పాడు. అలా అక్కడి నుంచి తన ఇంట్లో ఇద్దరు మహిళలను పనిచేసేందుకు పెట్టుకున్నాడు. వారిద్దరూ అతని ఇంట్లో కొన్ని రోజులు పనిచేశారు. ఆ తరువాత వారిలో ఒకరు ఆ యజమాని తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది
Blackmail | ఇంట్లో పనిమనిషి కావాలని ఒక వ్యక్తి వర్కర్లను సప్లై చేసే కన్సల్టెన్సీలో చెప్పాడు. అలా అక్కడి నుంచి తన ఇంట్లో ఇద్దరు మహిళలను పనిచేసేందుకు పెట్టుకున్నాడు. వారిద్దరూ అతని ఇంట్లో కొన్ని రోజులు పనిచేశారు. ఆ తరువాత వారిలో ఒకరు ఆ యజమాని తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో పనిమనిషి యజమాని అలాంటివాడేనని సాక్ష్యం చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కానీ ఆ తరువాత పోలీసులకు ఒక షాకింగ్ నిజం తెలిసింది.
పోలీసుల కథనం మేరకు.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డాలన్వలా ప్రాంతంలో నివసించే అమర్జీత్ సేఠీ అనే వ్యక్తి తన ఇంట్లో పనిమనుషులు కావాలని ఒక బ్రోకర్ ఆఫీస్ని సంప్రదించాడు. అలా అతని ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు మహిళలు వచ్చారు. వారిద్దరూ కొన్ని రోజులు మాత్రమే పనిచేశారు. ఆ తరువాత వారిలో ఒక మహిళ పోలీసులకు యజమాని అమర్జీత్ సేఠీ తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.
పోలీసులు అమర్జీత్ సేఠీని అరెస్టు చేశారు. మరో పనిమనిషిని కూడా విచారణ చేయగా.. ఆమె కూడా యజమాని అప్పుడప్పుడూ తన శరీరంపై చేతులు వేసేవాడని చెప్పింది. దీంతో అమర్జీత్ సేఠీపై కోర్టులో కేసు నడిచింది. కానీ కొంత సమయం తరువాత అమర్జీత్ సేఠీ బెయిలుపై బయటికి వచ్చాడు. ఆ ఇద్దరు పనిమనుషులను కలిసి కేసు వాపసు తీసుకోవాలని చెప్పాడు. అందుకు వారు రూ.30 లక్షలు అడిగారు. అతను చాలా కష్టపడి రూ.12 లక్షలు ఇచ్చాడు . మిగతావి ఇవ్వలేనని చెప్పాడు. అందుకు ఆ ఇద్దరు పనిమనుషులు అంగీకరించలేదు. మిగతా డబ్బులు ఇస్తేనే కేసు వాపసు తీసుకుంటామని చెప్పారు.
దీంతో ఏం చేయాలో తెలియక.. పోలీసు ఉన్నతాధికారికి అతను జరిగిన విషయం చెప్పాడు. ఆ తరువాత పోలీసులు అతడిని నమ్మి ఒక ట్రాప్ సెట్ చేశారు. పోలీసులు చెప్పినట్లు అతను వారిద్దరినీ మిగతా డబ్బులు తీసుకునేందుకు రమ్మన్నాడు. వారిద్దరూ అక్కడికి చేరుకోగానే అమర్జీత్ సేఠీ వారిద్దరి నోట నిజం మాట్లాడించాడు. అక్కడే దాగి ఉన్న పోలీసులు వారి మాటలు విని ఆశ్చర్యపోయారు.
అసలు ఇదంతా ఆ ఇద్దరు పనిమనుషలు డబ్బున్న వారిని బ్లాక్మెయిల్ చేసే బిజినెస్ అని విషయం తెలిసింది. పోలీసులు వెంటనే వారిద్దరినీ అరెస్టు చేశారు. వారి గ్యాంగ్లో ఇంకా ముగ్గురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ మాస్టర్ మైండ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.