CM KCR : సౌత్ ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డు సీఎం కేసీఆర్ కు సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదేంటంటే హ్యాట్రిక్ సీఎం రికార్డ్. ముచ్చటగా మూడోసారి వరుసగా సీఎం అయిన వారు దక్షిణాదిన ఇప్పటి వరకు ఎవరూ లేరు. అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలో కేసీఆర్ కచ్చితంగా ఆ రికార్డు
CM KCR : సౌత్ ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డు సీఎం కేసీఆర్ కు సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదేంటంటే హ్యాట్రిక్ సీఎం రికార్డ్. ముచ్చటగా మూడోసారి వరుసగా సీఎం అయిన వారు దక్షిణాదిన ఇప్పటి వరకు ఎవరూ లేరు. అయితే ఈసారి తెలంగాణ ఎన్నికలో కేసీఆర్ కచ్చితంగా ఆ రికార్డు బ్రేక్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు ఆశల్లో ఉన్నారు. గ్రౌండ్ లో రియాల్టీ మాత్రం మరోలా కనిపిస్తోంది. ఇంతకీ ఊరించిన హ్యాట్రిక్ సీఎం రికార్డు సౌత్ లో కాకలు తీరిన నేతలకు ఎందుకు సాధ్యం కాలేదు?? గతంలో రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన నేతలకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇప్పుడు తెలంగాణలో ఏ బీఆర్ఎస్ లీడర్ మాట్లాడినా.. హ్యాట్రిక్ కొడుతాం అన్న మాటే వినిపిస్తోంది. హ్యాట్రిక్ అన్న పదాన్ని హైలెట్ చేసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. గతంలో ఏ సీఎంకూ వరుసగా మూడోసారి సీఎం ఛాన్స్ ను దక్షిణాది రాష్ట్రాలు ఇవ్వలేదు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దిగ్గజనేతలకూ ఈ ఫీట్ సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో అది సాధ్యమవుతుందా అన్న చర్చ జరుగుతోంది. పైగా సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడం కూడా తొలిసారి.
సౌత్ ఇండియాలో మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు ఉన్నారు. కానీ వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన వారు లేరు. అదే నార్త్ లో నార్త్ ఈస్ట్ లో మాత్రం దశాబ్దాల తరబడి సీఎంలుగా పని చేసిన వాళ్లు ఉన్నారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్.. 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో ఉన్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. బెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్టు దిగ్గజనేత జ్యోతిబసు 23 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగారు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ ఫీట్ ఇంతవరకూ ఎవరికీ సాధ్యం కాలేదు.
ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి.. వరుసగా రెండుసార్లు సీఎం పదవిలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. దక్షిణ భారత రాష్ట్రాల ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఒకర్నే వరుసగా నెత్తిన పెట్టుకునే సంప్రదాయం ఇక్కడి ప్రజల్లో లేదు అన్నది గత ఫలితాలు సూచిస్తున్నాయి. ఎంత ఫేమస్ లీడర్ అయినా.. ఒక దఫా అందలమెక్కిస్తే.. మరో దఫా ఇంట్లో కూర్చోబెడుతున్న సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్లను మార్చేయడం దక్షిణాది ప్రజలకు అలవాటైన విషయమే. అది మూడోసారి ఒకే పార్టీకి కట్టబెట్టడం ఇప్పటి వరకు జరగలేదు.
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు నుంచి.. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్రెడ్డి దాకా తెలుగునాట వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేతలు ఎవరూ లేరు. నాయకులను నెత్తిన పెట్టుకుని పాలాభిషేకాలు, గుడులు కట్టించి అభిమానం చాటుకునే తమిళనాట.. అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలాంటి హేమాహేమీలకు కూడా వరుసగా పగ్గాలు ఇవ్వలేకపోయారు. అటు కేరళలో.. ఇటు కర్ణాటకలో.. దిగ్గజ నేతలుగా పేరొందినవారు ఇప్పటి వరకు హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 2014, 2018లో వరుసగా రెండుసార్లు తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ కు ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో కరుణానిధి సీఎంగా సుమారు 19 ఏళ్లు పనిచేసినా వరుసగా మూడుసార్లు ఎన్నిక కాలేదు. అదే రాష్ట్రానికి 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత కూడా వరుసగా మూడుసార్లు పగ్గాలు చేపట్టలేకపోయారు. ఎంజీఆర్ సైతం రెండుసార్లే సీఎం అయ్యారు. కన్నడనాట దేవరాజ్ అర్స్ మూడుసార్లు సీఎం అయ్యారుగానీ.. హ్యాట్రిక్ కొట్టలేదు. కర్ణాటక తొలి సీఎం ఎస్.నిజలింగప్ప రెండుసార్లు.. 1956, 1962 సంవత్సరాల్లో సీఎం అయ్యారు. యడియూరప్ప నాలుగుసార్లు సీఎం అయ్యారుగానీ.. వరుసగా జరగలేదు. కర్ణాటక ప్రస్తుత సీఎం సిద్దరామయ్య కూడా రెండుసార్లే ముఖ్యమంత్రి అయ్యారు. కేరళలో కరుణాకరన్ నాలుగుసార్లు సీఎం అయినా.. మధ్యలో జనం గ్యాప్ ఇచ్చారు. ఏకే ఆంటోనీ మూడుసార్లు సీఎం అయినా హ్యాట్రిక్ లేదు.
తెలంగాణలో హ్యాట్రిక్ సంగతిని పక్కన పెడితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా.. కేసీఆర్ ఈసారి రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ చేయలేదు. ఇది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ 1983లో గుడివాడ, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి.. రెండుచోట్లా గెలిచారు. 1989లో హిందూపురం, కల్వకుర్తి స్థానాల నుంచి పోటీ చేసినా.. హిందూపురంలో గెలిచి, కల్వకుర్తిలో ఓడిపోయారు. ఆయనపై కల్వకుర్తిలో అప్పట్లో చిత్తరంజన్దాస్ గెలిచారు.
అలాగే.. 2009లో తిరుపతి, పాలకొల్లు సీట్ల నుంచి పోటీ చేసిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓడిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేనాని పవన్ కల్యాణ్ 2019లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి, రెండు చోట్లా పరాజయం చెందారు.
మరి ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్పై.. ఈటల, రేవంత్ పోటీకి దిగారు. దీంతో రాజకీయాలు హ్యాట్రిక్ కంటే రెండు సెగ్మెంట్ల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. గత చరిత్ర చూస్తే రెండు చోట్ల బరిలో దిగిన నేతలెవరికీ అనుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. 1983లో తప్ప ఇంతవరకూ ఓటమి ఎరుగని కేసీఆర్ ఈ 2 స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. పైగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పోటీలో ఉండడం ఉత్కంఠను మరింత పెంచుతోంది.