Bharat Jodo Yatra : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు రెండో విడత యాత్రకు రాహుల్ సిద్దమవుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్యలో భారత్ జోడో యాత్ర 2.0 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాహుల్ గాంధీ గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. 2023 జనవరి 30న కశ్మీర్లో పాదయాత్రను ముగించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 76 లోక్సభ నియోజకవర్గాల మీదుగా 4 వేల 81 కిలోమీటర్ల మేర సాగింది ఈ యాత్ర. 2023 జనవరిలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసింది.
నిజం చెప్పాలంటే నిస్తేజంగా ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి భారత్ జోడో యాత్ర కొత్త ఊపిరిని ఇచ్చింది. అందుకే రెండో విడత భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. అయితే ఈ సారి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ భారత్ జోడో యాత్ర నిర్వహించే ఆలోచనలో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. దేశంలోని తూర్పు రాష్ట్రాల నుంచి పశ్చిమ రాష్ట్రాల వైపు యాత్ర సాగేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు.
ఈసారి హైబ్రిడ్ విధానంలో యాత్రను కొనసాగించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. పాదయాత్రతోపాటు వాహనాల ద్వారా యాత్రను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో కాంగ్రెస్ వేవ్ ఏర్పడేలా యాత్రను ప్లాన్ చేస్తోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ.