Revanth Reddy : అలంపూర్ లో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాగర్జన సభకు జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలంపూర్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని స్పష్టం చేశారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఏడారైందని రేవంత్ విమర్శించారు.తుమ్మిళ్ల ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ పోరాడిని విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చానన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపైన, కేసీఆర్ పైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అలంపూర్ దేవాలయానికి డబ్బులు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. పాలమూరు ప్రజల ఆత్మగౌరవం మీద దాడి జరుగుతోందన్నారు. ఈ జిల్లాలో ఒక్కరికైనా డబుల్ ఇళ్లు వచ్చాయా ? అని ప్రశ్నించారు. ప్రజల దుంఖం తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన లబ్ధిదారులు తమకు ఓటేస్తారన్నారు.
కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మరో సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు 24 గంటలకు కరెంట్ ఇవ్వడంలేదన్నారు. నిజంగా ఇస్తే తాను, సంపత్ నామినేషన్లు కూడా వేయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 గంటలే కరెంట్ ఇస్తుందని తాను ఎక్కడ చెప్పానో నిరూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు.ఆ కుటుంబంలో దళారీ వ్యవస్థ ఉందని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.