Yellanda : కృషి, పట్టుదల ఉంటే ఎంత కష్టమైనా సాధించాలేనిది ఏదీ ఉండదని చెప్పేందుకు ఈమె ఒక ఉదాహరణ. చదువుకోవాలన్న ఆమె కోరిక ముందు.. పేదరికం ఓడిపోయింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి.. తండ్రే అన్నీ అయి పెంచగా.. ఆ తండ్రి నేడు తలెత్తుకుని గర్వపడేలా డీఆర్డీఏలో శాస్త్రవేత్తగా కొలువు సాధించింది. యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న.. ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వనం ఉమాదేవి – సదానందం దంపతులకు రాజ్యలక్ష్మి పెద్ద కుమార్తె. 2004లో తల్లి రోడ్డుప్రమాదంలో మరణించగా.. తండ్రే అన్నీ తానై కూతుర్లను పెంచాడు. చేనేత కార్మికుడిగా పనిచేస్తూ.. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించాడు. ఎంత కష్టమొచ్చినా పిల్లల్ని చదివించే విషయంలో మాత్రం రాజీ పడలేదు. ఇల్లందులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే రాజ్యలక్ష్మి 10వ తరగతి పూర్తిచేసింది. ఇంటర్ పూర్తయ్యాక బాసర ట్రిపుల్ ఐటీలో సీటు (బీటెక్-కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) సంపాదించింది. బీటెక్ లో మంచి మార్కులతో పాస్ అవ్వడంతో.. అధ్యాపకులు ఆమెకు అక్కడే ఫ్యాకల్టీగా అవకాశం ఇచ్చారు.
బాసర ట్రిపుల్ ఐటీలో పనిచేస్తుండగానే.. ప్రశాంత్ అనే వ్యక్తితో వివాహం అయింది. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో డీఆర్డీఏలో పరీక్షలు రాసింది. ఆ తర్వాత బెంగళూరులోని డీఆర్డీఏలో కేటగిరీ-బీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించింది. కూతురికి డీఆర్డీఏలో సైంటిస్టుగా ఉద్యోగం రావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. కష్టపడి చదివించినందుకు.. తగిన ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూతురు సాధించిన ఘనత తమ కష్టాలను దూరం చేసిందని తెలిపారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఎన్నో ఇబ్బందులకోర్చి చదివానని, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని రాజ్యలక్ష్మి పేర్కొంది.