Chandrababu Eye Surgery : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ పూర్తయింది. ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఎల్వీ ఆస్పత్రిలో కంటి చికిత్స చేశారు వైద్యులు. చికిత్సలో భాగంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటలపాటు సాగింది. ఆపరేషన్ పూర్తికాగానే ఆయన తిరిగి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లారు. చికిత్స నేపథ్యంలో కొద్ది రోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై విడుదలయిన విషయం తెలిసిందే.
చంద్రబాబు రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కుడి కంటికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. చంద్రబాబు ఎడమ కంటికి ఇదివరకే కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఆయనకు ఈనెల 28 వరకు బెయిల్ వచ్చింది.
ఇదిలా ఉండగా చంద్రబాబు దాఖలు చేసిన కేసులపై విచారణ కొనసాగుతూనే ఉంది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఈ కేసుని ఈ నెల 22కు వాయిదా వేసింది.