Kurnool Crime : అవతలి వారి దగ్గర లేనిది మన దగ్గర ఉన్నపుడు దాని విలువ తెలీదంటారు. ఇది జీవిత సత్యం. వస్తువు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ.. మనిషే పోతే.. వారికి రీ ప్లేస్ మెంట్ అంటూ ఉండదు. క్షణికావేశంలో అయినవారిని పొట్టనపెట్టుకుని.. జైలు పాలవుతూ.. జీవితాంతం కుంగి కుమిలిపోతున్నవారెందరో ఉన్నారు.
కన్నవారిని, అయినవారందరినీ వదిలి.. పెళ్లి అనే పేరుతో భర్తే సర్వస్యం అని నమ్మివచ్చిన భార్యలను వరకట్నం వేధింపులతో చిత్రహింసలకు గురిచేస్తూ.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న క్రూరమృగాలు మనచుట్టూనే ఉంటున్నాయి. అలాంటి ఘటనే ఇది. వేధింపులు భరించలేక ఆత్మహత్యచేసుకున్న భార్యలకు అక్రమసంబంధాలను అంటగట్టి.. చట్టం నుంచి తప్పించుకున్నామని సంబరపడిపోతుంటారు. కానీ.. ఎప్పటికైనా అందుకు తగిన శిక్ష అనుభవించి తీరుతారనేదానికి ఉదాహరణే ఈ ఘటన. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా జోహారాపురంలో షాజహాన్ బీ అనే మహిళ.. వరకట్న వేధింపులు తాళలేక 2017లో బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత.. ఆమె తల్లిదండ్రులు భర్తైన ముక్తార్ భాషపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ముక్తార్ బాషపై వచ్చిన ఆరోపణలు నిజమేనని విచారణలో తేలడంతో.. షాజహాన్ బీ మరణించిన ఆరేళ్లకు అతనికి శిక్షపడింది. కర్నూల్ ఫోర్త్ అదనపు సెషన్స్ జడ్జి మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.