విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఘటన మరువకముందే అనంతపురంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకుల్లో వెళ్తున్న ఇద్దరు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనంతపురంలోని కలెక్టరేట్ ఎదురుగా జరిగింది. సయ్యద్, ఇక్బాల్ అనే ఇద్దరు యువకులు రెండు బైక్ లపై వస్తుండగా.. ధర్మవరం నుంచి బస్టాండ్ కు వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు బస్సు టైర్ల కింద పడిపోగా.. బస్సు వారిని 60 మీటర్ల వరకు అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఈ ప్రమాదంలో సయ్యద్, ఇక్బాల్ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మృతి చెందాడు.
విజయవాడ బస్టాండ్లో బస్సు బీభత్సం ఉలిక్కిపడేలా చేసింది. అయితే తాజాగా ఆ బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. బస్సు డ్రైవర్ తప్పిదం వల్ల బస్సు అకస్మాత్తుగా ముందుకు రావడం వీడియోలో తెలుస్తోంది. దానికి తోడు ప్రయాణికులు ఉన్న ఫుట్పాత్ ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో బస్సు డైరెక్టుగా ప్రయాణికుల మీదికి దూసుకెళ్లింది. అయితే ఈ విషాద ఘటనలో ఆరు నెలల చిన్నారి ఉండటం అందరినీ కలచివేసింది.
బస్సు బీభత్సాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, స్టాళ్ల నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేందుకు ఆటోనగర్ డిపోకు చెందిన మెట్రో లగ్జరీ నాన్ స్టాప్ బస్సు 24 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు 12 నెంబర్ ప్లాంట్ ఫాం వద్ద సిద్ధంగా ఉంది. బస్సును వెనెక్కి తీసేందుకు డ్రైవర్ గేర్ వేసి ఎక్స్లేటర్ తొక్కారు. కదలకపోవడంతో ఎక్స్ లేటర్ గట్టిగా తొక్కడంతో ఒక్కసారిగా బస్సు ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ఇనుప బారికేడ్లు, కుర్చీలు, స్తంభం తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బస్సు కింద పడి ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.