తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 12 మంది అభ్యర్థులతో నాలుగో విడత జాబితా ప్రకటించింది. మొత్తంగా నాలుగు విడతల్లో 100 సీట్లను ప్రకటించింది. మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి.. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టనున్నారు. వేములవాడ నియోజకవర్గం నుంచి తుల ఉమ బరిలో ఉండనున్నారు. ఇక ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి.. హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి.. సిద్ధిపేట నుంచి దొడ్డి శ్రీకాంత్ రెడ్డి బరిలో దిగనున్నారు. చెన్నూర్ నుంచి దుర్గం అశోక్ పోటీలో ఉండనున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇలాకా అయిన కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వికారాబాద్ స్థానాన్ని పెద్దింటి నవీన్ కుమార్ కు కేటాయిస్తే .. గద్వాల్ స్థానాన్ని బోయ శివకు కేటాయించారు. మొదటి విడతలో గద్వాల్ స్థానాన్ని డీకే అరుణకు కేటాయించాయి. అయితే ఆమె పోటీ చేయడానికి నిరాకరించారు. దీంతో ఆ సీటు బోయ శివకు ఇచ్చారు. ఇక మిర్యాలగూడ సాధినేని శ్రీనివాస్ బరిలో దిగనున్నారు. నకిరేకల్ నుంచి నకరకంటి మొగిలయ్య ఎన్నికల పోరులో ఉండనున్నారు. ఇక ములుగు టిక్కెట్ అజ్మీరా ప్రహ్లాద్ నాయక్కు బీజేపీ కేటాయించింది.