ఛత్తీస్ గఢ్, మిజోరాంలలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. కొద్దిసేపటికే ఛత్తీస్ గఢ్ లో పేలుడు సంభవించింది. దీంతో మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. సుకుమా జిల్లా తొండమర్కలో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్ పీఎఫ్ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధిత జవాన్ సీఆర్పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్ కు చెందిన ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు వెల్లడించారు.
కాగా.. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నేడు అక్కడ 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. వాటిలో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది. తొలివిడత పోలింగ్ జరుగుతున్న 7 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్ లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.