మ్యాచ్ మ్యాచ్ కి ఇండియా ఆధిపత్యం పెరిగిపోతోంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా జరుగుతున్న అన్ని మ్యాచ్ ల్లో చూస్తే, అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట విజృంభిస్తోంది. ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది.ఈ సమయంలో ఇండియా జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు విమర్శల వర్షం కురుస్తోంది. అవేమిటో చూద్దాం..
ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా జట్టును మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అప్రతిహిత విజయాలతో దూసుకెళుతున్న భారత్ జట్టుకి అభినందనలు తెలిపారు. శ్రీలంకపై ఆడిన తీరు తనకెంతో సంతోషం కలిగించిందని అన్నారు. అంతేకాదు వరల్డ్ కప్ లో నాకౌట్ మ్యాచ్ ల్లో కూడా విజయం సాధించి, వరల్డ్ కప్ సాధించాలని ఆకాంక్షించారు.
ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ ఇండియా ‘రన్ అవే రైలు’లా దూసుకుపోతోందని అన్నారు. దీనికి బ్రేకుల్లేవు..ఇంకెవరూ ఆపలేరని అన్నాడు. ముఖ్యంగా మహ్మద్ షమీ బౌలింగ్ చాలా బాగుందని అన్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్ ని పట్టుకున్నాడని తెలిపాడు. బుమ్రా, సిరాజ్ కూడా ఆకట్టుకుంటున్నారని కితాబిచ్చాడు. బ్యాట్స్ మెన్ ని ముగ్గురూ క్రీజులో అసలు కుదురుకోనివ్వడం లేదని చెప్పాడు. భారత్ అమ్ములపొదిలో బలమైన అస్త్రాలున్నాయి. అంతకుమించి వ్యూహాలున్నాయని తెలిపాడు.
ఇకపోతే భారత బౌలింగ్ ని విమర్శించిన హసన్ రాజాపై కూడా వసీం అక్రమ్ విరుచుకుపడ్డాడు. బాల్ ని టాంపరింగ్ చేయడం అంత ఈజీ కాదని తెలిపాడు. మ్యాచ్ కి ముందు 12 బాల్స్ ఉన్న బాక్స్ ని నలుగురు అంపైర్లు చూసి పరిశీలిస్తారు. తర్వాత జట్టుకిస్తారు. వాటిలో బౌలర్ రెండు బాల్స్ ని ఎంచుకుంటాడు. ఒకటి పాడైతే మరొకటి ఉంటుందని అన్నాడు. ఆ బాల్స్ ఉన్న బాక్స్ ప్లేయర్లతోపాటు డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉంటుందని తెలిపాడు. ఇవేవీ తెలీకుండా మాట్లాడకూడదని అన్నాడు.
భారత్ బౌలర్లు అంత గొప్పగా స్వింగ్ చేస్తున్నారంటే, దానిని అభినందించాలి, లేదంటే వారి నుంచి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. వారెంతో కష్టపడితేనేగానీ అలా బాల్ తిప్పడం సాధ్యం కాదని తెలిపాడు. మన పాకిస్తాన్ బౌలర్లకి ఎందుకది సాధ్యం కావడం లేదనేది ఆలోచించి సీనియర్లు పాఠాలు నేర్పించాలని అన్నాడు. అంతేగానీ ఇలాంటి చిల్లర విమర్శలు చేయడం సరికాదని ఘాటుగా స్పందించాడు.
కింగ్ కోహ్లీపై ప్రశంసలు ఎంత వస్తున్నా విమర్శలు కూడా వస్తున్నాయి. మొదట బంగ్లాదేశ్ పై సెంచరీ కోసం రన్ రేట్ తగ్గించేశాడనే విమర్శించారు. అలాగే కోల్ కతాలో కూడా కావాలనే స్లో గా ఆడాడని విమర్శించారు. అలాగే కోహ్లీ స్వార్థపరుడని మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ విమర్శించడం పతాకస్థాయికి చేరింది.
ఇక నిరంతరం కాంట్రవర్శీ చేసే గౌతమ్ గంభీర్ సైతం కోల్ కతా మ్యాచ్ పై మాట్లాడుతూ బౌలర్లకు స్వర్గధామంలా ఉన్న పిచ్ పై అంత ఓపికగా బ్యాటింగ్ చేయడం అసాధారణమైన విషయమని అన్నాడు. కోహ్లీ, శ్రేయాస్ ఇద్దరూ సమయానుకూలంగా ఆడారని కితాబునిచ్చాడు. సౌతాఫ్రికా అంతా కలిసి 83 పరుగులు చేస్తే, కోహ్లీ ఒక్కడే 101 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. విమర్శించే అందరూ ఇది గమనించాలని అన్నాడు.
వీటన్నింటికి చెక్ పెడుతూ కోహ్లీనే స్పందించాడు. మేనేజ్మెంట్ సూచన మేరకే అలా ఆడానని అన్నాడు. వికెట్ కాపాడుకుంటూ చివరి వరకు ఉండమని సందేశం రావడంతో అలా ఆడాల్సి వచ్చిందని అన్నాడు. అంతేకాదు హార్దిక్ పాండ్యా లేకపోవడంతో వికెట్లు కాపాడుకోవడం భారత్ కి ఎంతో అవసరమని అన్నాడు. అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు చేశామని అన్నాడు. అంతేకాదు కోల్ కతా పిచ్ పై 280 పరుగులు చేస్తే విజయం సాధించవచ్చుని అంచనా వేశామని అన్నాడు. ఆ ప్రకారమే ఆడాల్సి వచ్చిందని తెలిపాడు.
చివరిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డేల్లో 49 సెంచరీలు చేయడం సాధారణమైన విషయం కాదని అన్నాడు. సచిన్ కన్నా 175 మ్యాచ్ ల ముందే కోహ్లీ వీటిని సాధించడం ఒక అసాధారణమైన విషయమని అన్నాడు.
ప్రపంచంలోనే కొహ్లీ గొప్ప ఆటగాడు అని నేనెప్పుడో చెప్పాను. ఈరోజు సచిన్ రికార్డ్ బద్దలైనంత మాత్రాన నేనీ మాట చెప్పడం లేదని అన్నాడు. అసలు రికార్డ్స్ కి కొహ్లీ ఆటకి సంబంధమే లేదని అన్నాడు. నిజంగా తను ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిని మరోసారి మెచ్చుకున్నాడు. చూశారు కదండీ వన్డేవరల్డ్ కప్ 2023 సంగతులు…ఫైనల్ కి చేరేసరికి ఇంకెన్ని వస్తాయో చూడాల్సిందే