Angelo Mathews : బంగ్లాదేశ్ విజయం సాధించినా, అది స్ఫూర్తిదాయక విజయం కాదనే విమర్శలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. శ్రీలంక ఆల్ రౌండర్ ఎంజిలో మాథ్యూస్ ని బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్డ్ అవుట్ చేశారని, అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి టైమ్డ్ అవుట్ అంతర్జాతీయ క్రికెట్ లో ఇదే తొలిసారి కావడంతో వేడి మరింత రాజుకుంది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ – శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో 25 ఓవర్ దగ్గర హైడ్రామా నడిచింది. ఆల్ రౌండర్ మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. తీరా వచ్చాక హెల్మెట్ పట్టీ తెగిపోయినట్టు గమనించాడు. తన టీమ్ కి సందేశం ఇవ్వడంతో వాళ్లు కొత్త హెల్మెట్ తో హడావుడిగా వచ్చారు. ఈలోపు మూడు నిమిషాల గడువు అయిపోయింది.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ సమయం మించిపోయింది కాబట్టి టైమ్డ్ అవుట్ గా ప్రకటించమని అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ జరిగిన విషయాన్ని షకీబ్ తో చర్చించారు. కానీ తను సీరియస్ గా ఉన్నాడని గుర్తించారు. ఫీల్డ్ అంపైర్ తో చర్చించి, నిబంధనల ప్రకారం టైమ్డ్ అవుట్ గా ప్రకటించారు. క్రీజులో అడుగుపెట్టకుండా, ఒక్క బాల్ కూడా ఎదుర్కోకుండా ఇలాంటి అవుట్ కావడం అంతర్జాతీయ క్రికెట్ లో ఇదే మొదటిసారి కావడం విశేషం.
అంపైర్ జోక్ చేస్తున్నాడేమోనని పాపం మాథ్యూస్ నవ్వుతూ బ్యాటింగ్ కి సిద్ధమయ్యాడు. కానీ మరోసారి అంపైర్ చెప్పడంతో షాక్ తిన్నాడు. హెల్మెట్ పట్టీ తెగిపోయిందని చూపించి, సారీ చెప్పాడు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరాడు. అలాగే బంగ్లా కెప్టెన్ షకీబ్ దగ్గరికెళ్లి రిక్వెస్ట్ చేశాడు. కానీ తను కనికరించలేదు. అంపైర్లతో వాదించాడు. మూడు నాలుగుసార్లు షకీబ్ ని వెళ్లి అడిగాడు. కానీ ఫలితం రాలేదు. దీంతో నిరాశగా పెవెలియన్ కి వెళుతూ అక్కడ హెల్మెట్ ని విసిరేశాడు.
హెల్మెట్ ఇబ్బంది తెలియకముందే రెండు నిమిషాల సమయాన్ని వృధా చేశాడని ఫోర్త్ అంపైర్ తెలిపాడు. అయితే దురదృష్టం… తను మూడు నిమిషాలకన్నా పది సెకన్ల ముందే క్రీజులో ఉన్నాడని స్టార్ స్పోర్ట్స్ టైమర్ సూచించింది. మరీ చిన్న మిస్టేక్ ని అంపైర్లు ఎలా మిస్ అయ్యారన్నది మళ్లీ అదొక పెద్ద చర్చగా మారింది. మొత్తానికి టైమ్డ్ అవుట్ వివాదం రచ్చ రచ్చ అయ్యింది.
అయితే మాథ్యూస్ జరిగిన తప్పుని సరిదిద్దమని కోరడం ప్రజల్లో సానుభూతిని తీసుకొచ్చింది. అతన్ని హీరోని చేసింది. అంతేకాదు మాథ్యూస్ రిక్వెస్ట్ చేస్తుంటే బంగ్లా కెప్టెన్ తోటి క్రికెటర్లతో నవ్వుతూ కనిపించాడు. అదే అతన్ని విలన్ ని చేసింది. దీంతో నెటిజన్లు మండిపోయారు. పోస్టింగుల మీద పోస్టింగులు పెట్టారు..
ఇదేనా జంటిల్మెన్ గేమ్ అంటే? అని ఒకరు, ఇది సిగ్గు చేటు? అని ఒకరు, ఇది క్రీడాస్ఫూర్తికే విరుద్ధం అని ఒకరు, ఇదా గెలుపు? దీనిని గెలుపు అంటారా? అని ఒకరు, ఇప్పుడు గెలిచి ఏం ఉద్ధరించావ్? ఇంటికే కదా వెళ్లింది… ఈ మాత్రం దానికి పెద్ద తోపు తురుంఖాన్ లా ఫోజులెందుకు? అంటూ మాటలతో షకీబ్ ని చిత్రవధ చేశారు.
ఏది ఏమైనా… టైమ్డ్ అవుట్ అయిన తొలి ఆటగాడిగా మాథ్యూస్ మాత్రం రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బ్యాటింగ్ కి వచ్చిన తర్వాత షకీబ్ ని సెంచరీ చేయకుండా 82 పరుగుల దగ్గర ఇదే మాథ్యూస్ అవుట్ చేశాడు.అప్పుడు షకీబ్ తీవ్ర నిరాశ నిస్ప్రహల మధ్య వెళుతుంటే మాథ్యూస్ చేతి గడియారం వైపు చూపించి, టైమ్డ్ అవుట్ కి గిఫ్ట్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు ఇప్పుడు నా టైం వచ్చింది అంటూ మరో మూమెంట్ ఇచ్చాడు. ఇవన్నీ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
అయితే 2007లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఒకసారి కెప్టెన్ గంగూలి ఇలాగే క్రీజులో ఆరు నిమిషాల సమయం తీసుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అప్పీల్ చేయడానికి నిరాకరించాడు. అలా గంగూలి బతికిపోయాడు. లేదంటే తనకే ఈ టైమ్డ్ అవుట్ రికార్డ్ వచ్చేది.
ఇదే మాథ్యూస్ శ్రీలంక కెప్టెన్ గా ఉన్నప్పుడు, ఇంగ్లండ్ బ్యాటింగ్… శ్రీలంక బౌలర్ వార్నింగ్ లు ఇచ్చినా బ్యాట్స్ మెన్ పదేపదే క్రీజ్ దాటుతుంటే బౌలర్ సేననాయకే అవుట్ చేశాడు. అప్పుడు కెప్టెన్ మాథ్యూస్ తో అంపైర్లు చర్చించారు. తను ఒప్పుకోకపోవడంతో అవుట్ ఇచ్చారు.
పాపం ఊరికే పోదు, అప్పటిది ఇప్పుడు తిరిగి కొట్టిందని కొందరు రీట్వీట్లు చేస్తున్నారు.