తెలంగాణలో ఎన్నికల జాతర సాగుతోంది. గెలుపే లక్ష్యంగా.. అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ ప్రచారంతో దుమ్ములేపుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు.. ఎన్నికల హామీలపై భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ్టి నుంచి రేవంత్ ప్రచారంలో దూసుకుపోనుండగా.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దీంతో ఒకే రోజు అటు ఢిల్లీ బీజేపీ అగ్రనేత, ఇటు బీఆర్ఎస్ అధినేతతో పాటు టీపీసీసీ రేవంత్ ప్రచారాల జోరుతో రాష్ట్రంలో మరింతగా ఎన్నికల కోలాహాలం, హడావుడి నెలకొంది. ఇక త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో మూడు సభలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు. ఈ మేరకు ప్రోగ్రాం సక్సెస్పై ఫోకస్ పెట్టాయి. భారీగా జనసమీకరణ చేసి తమ బలాన్ని నిరూపించుకునే పడ్డారు నేతలు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇవాళ్టి నుంచి సుడిగాలి పర్యటనతో రాష్ట్రాన్ని చుట్టిరానున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పలుచోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొనన్నారు. రేవంత్ ప్రచార నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లలో మునిగారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రచారంలో భాగంగా ఇవాళ అలంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు రేవంత్. ఆ తర్వాత అలంపూర్, గద్వాల్, మక్తల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
ఇక అలాగే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించే ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ఆయన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని.. 5 గంటల 25 నిమిషాలకు సభా స్థలానికి చేరుకుంటారు. ఐదు గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకూ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే,.. బీసీనే సీఎం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బీసీ ఆత్మగౌరవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు. ఇక అలాగే ఈ ప్రకటన నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వతా ఆసక్తి నెలకొంది. మరోపక్క బీజేపీ జనసేనల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో.. ఈ సభకు ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ కూడా పాల్గొనే అవకాశముంది.
ఎన్నికల ప్రచార జోరుతో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి పర్యటనతో తెలంగాణ వ్యాప్తంగా రోజుకు మూడు సభల చొప్పున తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం ఒంటి గంటకు చెన్నూరులో, ఆ తర్వాత 2 గంటలకు మంథనిలో.. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పెద్దపల్లి సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
ఇక హోరాహోరీగా సాగుతున్న ఈ కదనరంగంలో ఇవాళ మూడు ప్రధాన పార్టీ నేతల ప్రచారాలు ఉండటంతో వారి ప్రసంగాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ బీసీ నినాదం ఎత్తుకోవడంతో ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.