Gaza Terror Lab : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆరంభమై 30 రోజులు. ‘ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్’లో భాగంగా ఐడీఎఫ్ బలగాలు గాజాలో చొచ్చుకుపోతున్నాయి. ఇటు భూతల, గగనతల దాడులతో గాజా గజగజలాడుతోంది. గత వారం 2500 హమాస్ లక్ష్యాలపై బాంబులు కురిపించినట్టు ఐడీఎఫ్ చెబుతోంది.
అడుగు అడుగు ముందుకేస్తున్న సైన్యానికి తాజా తనిఖీల్లో హమాస్ మిలిటెంట్ల ఆయుధాలు పెద్ద ఎత్తున చేజిక్కాయి. ఓ టెర్రర్ ల్యాబ్ కూడా బయటపడింది. సాయుధ డ్రోన్లు, కలష్నికోవ్ రైఫిళ్లు, ఆర్పీజీల(రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు)ను ఐడీఎఫ్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. హమాస్ మిలిటెంట్లు వాటిని ఓ ఇంట్లో రహస్యంగా భద్రపరిచారు.
పట్టుబడిన ఆయుధసామగ్రిలో రక్షణ పరికరాలు, మందుగుండు కూడా ఉన్నాయి. ఆయుధాల్లో కొన్నింటిని ఇజ్రాయెల్ సైనికులు ధ్వంసం చేయగా, పరిశోధన నిమిత్తం మరికొన్నింటిని ఇజ్రాయెల్కి పంపారు. పేలుడు పదార్థాల తయారీ ల్యాబ్ను కూడా ఐడీఎఫ్ గుర్తించి.. ధ్వంసం చేసింది.
మరోవైపు కాల్పుల విరమణ చేయాలంటూ వివిధ దేశాలు, మానవతా సంస్థల నుంచి ఇజ్రాయెల్పై ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే గాజా సిటీని చుట్టుముట్టిన ఐడీఎఫ్.. మరో 48 గంటల్లో సిటీలోకి ఎంటరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఈ తరుణంలో కాల్పుల విరమణపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
అయితే కాల్పుల విరమణ సమయాన్ని మిలిటెంట్లు తమకు అనుకూలంగా వినియోగించుకుంటారనే భయం కొందరిని వెన్నాడుతోంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 9,922 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడిలో 1400 మందికిపైగా మరణించారు.