Telangana Elections : బీఆర్ఎస్ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? అదేంటి.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను… బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చేశారు కదా? మళ్లీ ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా? ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం సీఎం కేసీఆరే. ఎందుకంటే… ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు శ్రీరామరక్ష అని ఆయన నిన్న ఖమ్మం సభలో చెప్పడంతో.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని, దేశంలో గుణాత్మక మార్పు రావాలని నిన్నటిదాకా మాట్లాడిన కేసీఆర్… ఇప్పుడు సడన్గా ప్రాంతీయ పార్టీ పల్లవి ఎత్తుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? లేక ఓటమి భయంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే డిస్కషన్ మొదలైంది.
బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టి భారీ ఖర్చుతో పెద్దఎత్తున సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఏపీలో ఆఫీస్ ఓపెన్ చేసి ఓ కమిటీని కూడా నియమించారు. ఒడిశాలో కూడా బీఆర్ఎస్కు ఇన్ఛార్జ్ ఉన్నారు. అంతేకాదు.. ఢిల్లీలో ఆగమేఘాల మీద పార్టీ కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించారు. ఇంత జరిగాక.. ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు శ్రీరామరక్ష అని గులాబీ బాస్ మాట్లాడటం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి.
కేసీఆర్ కామెంట్స్ను రాజకీయ వర్గాలు మాత్రం మరోలా చూస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి… మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మూడోసారి అధికారంలోకి రావాలనే వ్యూహంతోనే కేసీఆర్ కొత్త నినాదం ఎత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆరే దెబ్బతీశారని… కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడం కోసమో, లేక మరేదైనా ఎజెండాతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి సరిదిద్దుకోలేని పొరపాటు చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు.