Dhanteras : దీపావళి అంటేనే సందడి. పిల్లలకు బాణసంచా కాల్చాలన్న సరదా. అతివలకైతే పసిడి కొనుగోలుపైనే
మోజు. దీపావళికి ముందే వచ్చే ధంతెరాస్ రోజు స్వర్ణభరణాల దుకాణాల్లో ఒకటే రద్దీ. ధంతెరాస్ లేదా ధన త్రయోదశి రోజు రవ్వంతైనా పసిడి కొంటే పట్టిందల్లా బంగారమవుతుందని ఓ విశ్వాసం. లక్ష్మీదేవి ఇంటికి నడుచుకుంటూ వస్తుందని అంటుంటారు.
బంగారంపై మోజు ఈ నాటిది కాదు. భూమ్మీద ఉన్న బంగారంలో 86% గత 200 ఏళ్లలో తవ్వి తీసిందే. ఆధునిక మైనింగ్ టెక్నిక్లతో భారీ ఎత్తున స్వర్ణాన్ని వెలికితీయడం సాధ్యమే. 1800 సంవత్సరం తర్వాత బంగారం వెలికితీత ఊహించనంత వేగంతో జరిగింది. 1820-2022 మధ్య ఏ దేశం ఎంత బంగారాన్ని తవ్వి తీసిన గణాంకాలను పరిశీలిస్తే.. గోల్డ్ మైనింగ్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది.
బంగారాన్ని తొలుత కనుగొన్నది ఎవరన్న విషయమై చరిత్రకారులు నిర్ధారణకు రాలేకపోయారు. అయితే క్రీపూ 2450లో
ఈజిప్షియన్లు తొలుత స్వర్ణాన్ని కనుగొన్నారన్నది విస్తృత ప్రచారంలో ఉంది. ఈజిప్టు ఆల్కెమిస్ట్ జోసిమోస్ నుబియో ప్రాంతంలో దేని కోసమో అన్వేషిస్తున్న సమయంలో.. బంగారం కాకతాళీయంగా బయటపడిందనిచెబుతారు.
అమెరికాలో 1848లో జేమ్స్ మార్షల్ అనే వ్యాపారి శాక్రిమెంటో వ్యాలీలో బంగారం గనులను కనుగొన్నారు. ఆధునిక
చరిత్రలో బంగారం విలువ ఏ పాటిదో తెలిసింది అప్పుడే. ఏడేళ్లలోనే 2 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని ఆ రోజుల్లోనే తవ్వి తీశారు. 1890 వరకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా దేశాలు భారీ మొత్తంలో పుత్తడిని ఉత్పత్తి చేశాయి.
ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో విట్వాటర్సాండ్ బేసిన్లో భారీ ఎత్తున పసిడి నిక్షేపాలను కనుగొన్నారు. ప్రస్తుతం
గోల్డ్ఫీల్డ్స్కు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది దక్షిణాఫ్రికా. 1970లో ఆ దేశం అత్యంత గరిష్ఠస్థాయిలో 1002 టన్నుల గోల్డ్ను వెలికితీసింది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో.. 1980 నుంచి దాని ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2007 నాటికి బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశంగా చైనా మొదటస్థానంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం దాదాపు 40 దేశాలు పసిడిని ఉత్పత్తి చేస్తున్నాయి.
2022 ప్రపంచంలో ఉత్పత్తి అయిన బంగారంలో 31 శాతం మూడు దేశాలదే. టాప్ 3 స్థానాల్లోఉన్న చైనా, రష్యా, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిరుడు 300 టన్నుల పసిడిని ఉత్పత్తి చేశాయి. చైనాలో 330 టన్నులు, రష్యా-ఆస్ట్రేలియా దేశాల్లో 320 టన్నుల చొప్పున బంగారం ఉత్పత్తి జరిగిందని అంచనా.
కెనడా 220 టన్నులు, అమెరికా 170, మెక్సికో 120, కజకిస్థాన్ 120, దక్షిణాఫ్రికా 110, పెరూ-ఉజ్బెకిస్థాన్ దేశాల్లో 100 టన్నుల చొప్పున పసిడి ఉత్పత్తి జరిగింది. స్వల్ప మొత్తాల్లో ఘనా 90 టన్నులు, ఇండొనేసియా 70 టన్నులు ఉత్పత్తి కాగా.. మిగిలిన దేశాలన్నీ కలిపి 1030 టన్నుల బంగారాన్ని గత ఏడాది ఉత్పత్తి చేశాయి. మొత్తం మీద నిరుడు 3100 టన్నుల బంగారాన్ని వెలికితీశారన్నమాట.