Stubble Burning : పంజాబ్లోని బటిండాలో కొందరు రైతులు ఓవరాక్షన్ చేశారు. ఢిల్లీ గ్యాస్ చాంబర్లా మారడానికి పంజాబ్, హరియాణా రైతులు తగలబెడుతున్న పంట వ్యర్థాలే కారణమని ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నెత్తి, నోరు బాదుకొని చెబుతున్నా అక్కడి రైతులు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. పంజాబ్లోని బటిండాలో పంట వ్యర్థాలను కాల్చడాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే పంట వ్యర్థాలకు నిప్పంటించారు రైతులు. ఈ తతంగాన్ని అంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు పంజాబ్ రైతులు.
కాలుష్యానికి కారణవుతుండటంతో పంజాబ్తోపాటు హరియాణా, ఢిల్లీల్లో పంట వ్యర్థాలను కాల్చడంపై ఆయా ప్రభుత్వాలు నిషేధం విధించాయి. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా బటిండాలోని పంట వ్యర్థాలను కాల్చడాన్ని ఓ అధికారి అడ్డుకోబోయాడు. దీంతో స్థానిక వ్యవసాయ సంఘానికి చెందిన 50-60 మంది రైతులు ఆయనను చుట్టుముట్టారు. అక్కడే ఉన్న వరిగడ్డి కుప్ప వద్దకు తీసుకెళ్లారు. అతని చేతికి అగ్గిపెట్టె ఇచ్చి దానిని అంటుపెట్టాలని ఒత్తిడి చేశారు. చేసేదేం లేక అతడు దానిని కాల్చివేశాడు.
అయితే ఈ వీడియోను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైతుల చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని వెతికే పనిలో పడ్డారు.
ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం చేరింది. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో రాత్రి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 999కు చేరింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో అత్యంత దారుణ పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో పీల్చే విషపూరితమైన గాలి అస్తమా, శ్వాసకోశ రోగులకు టెన్షన్ను పెంచుతోంది. దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడం కలవరపరుస్తోంది.
దీనికి తోడు ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం లేదని చెబుతోంది వాతావరణ శాఖ. దీంతో కాలుష్యం నుంచి ఉపశమనం పొందే ఆశ లేదనే చెప్పాలి. కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వ చర్యలు సరిపోవని చెబుతున్నారు నిపుణులు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా NCR లోని అన్ని ప్రాంతాలలో ఉదయం పూట ఆకాశంలో పొగమంచు దారుణంగా ఉంటుంది. దీని కారణంగా రోడ్లపై విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది.