Telangana Elections : తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ నేతలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మరికొంత మంది. వివిధ ప్రాంతాలలో బాధితులు తమ ఆవేదన, ఆక్రోశాన్ని నామినేషన్ల రూపంలో బయటపెట్టేందుకు రెడీ అయ్యారు. కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆయనకు కామారెడ్డి ప్రాంత రైతులు షాక్ ఇవ్వనున్నారు . సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పౌల్ట్రీ రైతులు, అమరవీరుల కుటుంబాలు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తాము కేసీఆర్పై పోటీకి వంద నామినేషన్లు దాఖలు చేస్తామని ఇప్పటికే కామారెడ్డి ప్రాంత రైతులు ప్రకటించారు.
ఇక కోరుట్ల నియోజకవర్గంలో వంద నామినేషన్లు వేస్తామని.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామంటూ చెరుకు రైతులు అల్టిమేటం జారీ చేశారు. 2014 ఎన్నికల టైమ్లో అధికారం ఇస్తే.. రాష్ట్రంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను వంద రోజుల్లో స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మాటలు నమ్మి రైతులందరు బీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపించారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మర్చిపోయిన కేసీఆర్.. నడుస్తున్న ఫ్యాక్టరీలను లే ఆఫ్ పేరిట మూసివేయించి వేలాది మంది రైతులు, కార్మికుల పొట్టకొట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రీజినల్ రింగ్రోడ్డు బాధిత రైతులు. భువనగిరి నియోజకవర్గంలో… అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము బరిలో నిలుస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిపుల్ ఆర్ బాధిత రైతు ఎన్నికల బరిలో నిలువనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు నిరుద్యోగులు కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. ఈ సారి తెలంగాణలో నామినేషన్ల పర్వం ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.