Telangana Elections : ఇప్పటికే వంద మందితో రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. మిగిలిన 19 మంది అభ్యర్థులతో మూడో లిస్ట్ను రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు మూడో లిస్ట్ను విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల విషయంలో కూడా కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో మూడో జాబితా ప్రకటన కాస్త ఆలస్యమైంది.
మరోవైపు సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనుండటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి నుంచి దూరమవుతున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి కేటీఆర్పై కూడా బలమైన నేతను బరిలోకి దించాలని చూస్తోంది కాంగ్రెస్.
మరోవైపు ఈరోజు కమ్యూనిస్టులతో ఫైనల్గా మరోసారి చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే సీపీఎం కాంగ్రెస్కు కటీఫ్ చెప్పగా.. సీపీఐ మాత్రం కలిసి నడిచేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు తెలిపారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం.