ICC World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నేడు ఇండియా-సౌతాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇంతవరకు వరల్డ్ కప్లో పోరాట యోధుల్లా దూసుకుపోతున్న రెండు జట్ల మధ్య పోటీపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
వరుసగా మ్యాచ్ల మీద మ్యాచ్లు గెలుస్తుంటే, ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. అదేమైనా ఉంటే ఈ మ్యాచ్ లోనే పోవాలని, టీమ్ ఇండియా ఆటగాళ్లు మళ్లీ భూమ్మీదకు రావాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓడినా మన మంచికేనని కొందరంటున్నారు. సెంటిమెంట్గా పడుంటాదని అంటున్నారు.
ఎందుకంటే 2011లో ధోనీ సారథ్యంలో వరల్డ్ కప్ కొట్టిన టీమ్ ఇండియా ఇలాగే లీగ్ దశలో అన్నిమ్యాచ్ ల్లో గెలిచి సౌతాఫ్రికాపై ఓడింది. అప్పుడు మనవాళ్లు కప్ తీసుకొచ్చారు. అందువల్ల అదీ మన మంచికేనని వ్యాఖ్యానిస్తున్నారు.
వరల్డ్ కప్ 2023లో ఓటమన్నదే ఎరుగని టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా పేస్ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్ ప్రత్యర్థులను వణికిస్తున్నారు. సగం మ్యాచ్ను వీరే లాగేస్తున్నారు. తర్వాత బ్యాటింగ్ లో రోహిత్, కోహ్లీ ఇద్దరే టాప్ సీనియర్లుగా ఉన్నారు. వీరే జట్టుకి కొండంత అండగా ఉన్నారు. అంతేకాదు సగం భారాన్ని మోస్తున్నారు.
ఇక చిరుతల్లా కనిపిస్తున్న శుభ్ మన్ గిల్, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్లు ఫామ్లోకి వచ్చారు. అటు వికెట్ కీపర్గా, ఇటు కీలక బ్యాటర్గా కేఎల్ రాహుల్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాడు.
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. బౌలింగ్ లో వికెట్లు రాకపోతున్నా, పొదుపుగా చేస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో రన్స్ పెరగకుండా చూస్తున్నాడు. బ్యాటింగ్ లో కూడా రాణిస్తున్నాడు. కులదీప్ తన వంతు పాత్ర తను పోషిస్తున్నాడు. ఇలా టీమ్ ఇండియా అంతా పుష్కల వనరులతో నిండిన జట్టుగా కళకళలాడుతోంది. ఈ సమయంలో లీగ్ లో జైత్రయాత్ర కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఇకపోతే సౌతాఫ్రికాలో అందరూ సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నారు. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న డికాక్ ఇప్పటికే 4 సెంచరీలు చేశాడు. వాండర్ డస్సెన్ రెండు సెంచరీలు కొట్టాడు. తర్వాత మిడిలార్డర్ లో క్లాసెన్, మిల్లర్, మార్ క్రమ్ జట్టు స్కోరుని 300 నుంచి 350 పైన దాటించేస్తున్నారు. ప్రపంచకప్ చరిత్రలో 428 పరుగులు చేయడమే కాదు, మరో మూడు మ్యాచ్ లో 350 ప్లస్ పరుగులు చేసి, మంచి దూకుడు మీదున్నారు. వీరిని టీమ్ ఇండియా పేసర్లు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఈడెన్ గార్డెన్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉందని అంటున్నారు. అందువల్ల బుమ్రాకి రెస్ట్ ఇచ్చి అశ్విన్ను తీసుకోవచ్చునని అంటున్నారు. ఇప్పటివరకు ప్రపంచకప్ లలో 5 సార్లు సౌతాఫ్రికా-ఇండియా మధ్య మ్యాచ్లు జరిగితే రెండుసార్లు ఇండియా, మూడుసార్లు సౌతాఫ్రికా విజయం సాధించాయి.
ఇప్పటివరకు ఇండియా-సౌతాఫ్రికా 90 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. వీటిలో 50 సార్లు సౌతాఫ్రికా విజయం సాధించింది. ఇండియా 37 మ్యాచ్ ల్లో గెలిచింది. మూడు మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు.
ఈ లెక్కలన్నీ చూస్తుంటే … సఫారీలతో మ్యాచ్ అంత ఈజీగా కనిపించడం లేదు.