Pakistan Vs New Zealand : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించి, పాకిస్తాన్ కి మేలు చేసింది.
Pakistan Vs New Zealand : అదృష్టవంతుడిని ఆపలేం, దురదృష్టవంతుడిని బాగుచేయలేమని ఒక సామెత… అది అక్షరాల ఈరోజు పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రుజువైంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించి, పాకిస్తాన్ కి మేలు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాకిస్తాన్ ఇంటికేనని అంతా అనుకున్నారు. ఛేజింగ్ లో దిగిన పాకిస్తాన్ కూడా దూకుడుగానే మొదలుపెట్టింది. 21.3 ఓవర్ల దగ్గర వర్షం రావడంతో మ్యాచ్ నిలిపేశారు. అప్పటికి ఒక వికెట్ నష్టానికి 160 పరుగుల మీద ఉంది. వర్షం ఆగిన వెంటనే లక్ష్యాన్ని 41 ఓవర్లలో 342 పరుగులకి కుదించారు.
25.3 ఓవర్లు గడిచేసరికి మళ్లీ వర్షం మొదలైంది. ఇక కొనసాగించడం కష్టమని అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి పాక్ ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం పాక్ 25.3 ఓవర్లో 179 పరుగుల చేయాలి. కానీ వీరు 200 చేశారు. ఈ లెక్కన 21 పరుగుల తేడాతో కివీస్ పై గెలిచిందని డిక్లేర్ చేశారు.
పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ సెంచరీతో చెలరేగాడు. 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తర్వాత 121 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి కెప్టెన్ బాబర్ (66) సహకారం అందించాడు. పాక్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ఫఖర్ రికార్డ్ సృష్టించాడు న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోథీని చివర్లో వీరిద్దరూ ఒక ఆట ఆడుకున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ఎక్కడా తడబాటు లేకుండా ఆడింది. మొదటి వికెట్ జట్టు స్కోరు 68 పరుగుల వద్ద ఉండగా డేవిడ్ కాన్వే (35) రూపంలో పడింది. తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. మరో ఓపెనర్,రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఇద్దరూ కలిసి జట్టుని పటిష్టస్థితికి తీసుకువెళ్లారు. ఈ దశలో రచిన్ సెంచరీ కూడా చేశాడు. తర్వాత విలియమ్సన్ 95 పరుగులు చేసి, సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. అప్పటికి 34.2 ఓవర్లు గడిచాయి. 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి కివీస్ దూకుడు మీద కనిపించింది.
వెంటనే సెంచరీ వీరుడు రచిన్ (108) అవుట్ అయ్యాడు. డారిల్ మిచెల్ (29), మార్క్ చాప్ మన్ (39), గ్లెన్ ఫిలిప్స్ (41), మిచెల్ శాంట్నర్ (26) అందరూ చితక్కొట్టడంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల రికార్డ్ స్కోర్ చేసింది. ఇక అంతా అయిపోయింది…హ్యాపీగా సెమీస్ కి వెళ్లిపోయినట్టేనని కివీస్ అనుకుంది. కానీ వరుణుడు అడ్డంపడి కథ మొత్తం మార్చేశాడు.
ఎలాగైతేనేం పాక్ మళ్లీ గేర్ మార్చింది. సీన్ లోకి వచ్చింది. ఇప్పటికీ సెమీస్ ఆశలు పదిలంగానే ఉన్నాయి. పాకిస్తాన్ తర్వాత మ్యాచ్ ఇంగ్లండ్ తో ఆడనుంది. న్యూజిలాండ్ అయితే తర్వాత మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది. ఇప్పుడు వీరిద్దరూ 8 పాయింట్లతో సమానంగా ఉన్నారు. ఒకవేళ రేపు ఇద్దరూ గెలిస్తే రన్ రేట్ ప్రకారం న్యూజిలాండ్కే సెమీస్ అవకాశాలున్నాయి.