Sahasrakavacha : మహాభారతంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు సహస్ర కవచుడు అనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగాడు.
‘దేవా! నాకు 1000 కవచాలు ప్రసాదించు. వెయ్యేళ్లు తపస్సు చేసి వచ్చిన వాడు.. నాపై వెయ్యే్ళ్లు యుద్ధం చేస్తేగానీ.. నా వెయ్యి కవచాల్లో ఒకటి రాలి పడిపోయేలా వరం ఇవ్వు’ అని కోరాడు.
ఈశ్వరుడు సరేనన్నాడు. దీంతో ఆ రాక్షసుడు రెచ్చిపోయి ముల్లోకాలనూ పీడించగా, దేవతలంతా పారిపోయి విష్ణువుకు మొరపెట్టుకున్నారు. దీంతో వారిని రక్షించేందుకు ఆయన నరుడు, నారాయణుడిగా ఏకకాలంలో రెండు రూపాలతో భూమ్మీదికొచ్చాడు.
ముందు నారాయణుడు.. సహస్ర కవచుడితో వెయ్యేళ్లు యుద్ధం చేయగా, ఆ రాక్షసుడి ఒక కవచం ఊడిపోయింది. ఆ వెంటనే నారాయణుడు తపస్సుకు కూర్చున్నాడు. ఆ వెంటనే.. నరుడి రూపంలో ఉన్న విష్ణువు వాడితో యుద్ధం మొదలుపెట్టి వెయ్యేళ్ల పాటు సాగించి రెండో కవచాన్ని పగలకొట్టాడు.
ఈ లోపు నారాయణుడు వెయ్యేళ్ల తపస్సు పూర్తి చేసి వెయ్యేళ్ల యుద్ధానికి రాగా.. మూడవది.. తర్వాత నరుడి చేతిలో నాలువది.. ఇలా 999 కవచాలను విష్ణువు తన నర, నారాయణ అవతారాల్లో బద్దలు కొట్టాడు.
దీంతో మిగిలిన ఒకే కవచంతో సమస్ర కవచుడు యుద్ధరంగం నుంచి పారిపోయాడు. ప్రపంచంలోని ఏ దేవతా అతడికి అభయం ఇవ్వలేదు. చివరికి సూర్యుడు అభయమివ్వడా.. వాడు సూర్యలోకంలో దాక్కుండిపోయాడు.
అయినా.. నర,నారాయణుల రూపంలో ఉన్న విష్ణువు వాడిని వెతుకుతూ బయలుదేరాడు. అదే సమయంలో కుంతీ దేవి.. దుర్వాసుడి వరాన్ని పరీక్షించేందుకు సూర్యుడిని ప్రార్థిస్తుంది.
విష్ణువు వస్తే తన తప్పిదం బయటపడుతుందని భావించిన సూర్యుడు… తన లోకంలో దాక్కున్న సహస్రకవచుడిని కుంతికి సంతానవరంగా ప్రసాదిస్తాడు.
దీంతో కుంతికి సహజ కవచంతో ఉన్న పిల్లవాడు జన్మించాడు. అయితే.. వాడి కాంతికి, లోకనిందకు భయపడిన కుంతి ఆ బాలుడిని గంగానదిలో వదిలేయగా, రాధ అనే మహిళ బాలుడిని గుర్తించి పెంచి పెద్దచేసింది. దీంతో రాధేయుడిగా కర్ణుడు పెరిగాడు.
అనంతర కాలంలో ఆ కర్ణుడిని సంహరించటానికి అదే విష్ణువు.. నరుడిగా అర్జునుడి రూపంలో, నారాయణుడిగా కృష్ణావతరంలో భూమ్మీద జన్మించారు.
కృష్ణుని వ్యూహం, అర్జునుడి భుజబలం.. ఈ రెండూ కలిసి చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడిగా వచ్చిన సహస్ర కవచుడిని నేలకరిపించాయి.