Kurnool History : రాయలసీమలో ప్రధాన నగరాల్లో కర్నూలు ఒకటి. ఈ నగరానికి 2303 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. దీని అసలు పేరు.. కందనవోలు. అదే కాలక్రమంలో కర్నూలు అయింది.
తొలినాళ్లలో బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయుల పాలనలో ఉన్న ఈ పట్టణం.. తర్వాతి రోజుల్లో విజయనగర పాలకుల చేతికొచ్చింది.
1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్షాహీ నవాబులు కర్నూలును ఆక్రమించుకున్నారు. తర్వాత దీనిని బీజాపూరు సుల్తాన్ వశపరుచుకోగా.. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసి, ఈ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
అనంతరం ఈ ప్రాంతాన్ని ఔరంగజేబ్.. తన మొఘల్ సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్కు జాగీరుగా బహూకరించాడు. 1733 లో అతని మరణానంతరం పాలన చేపట్టిన హిమాయత్ ఖాన్ మొదటి కర్నూలు నవాబుగా తన పాలకవంశాన్ని ప్రారంభించారు. ఇతడు.. ఆ రోజుల్లో జరిగిన బ్రిటిష్ – ఫ్రెంచి యుద్ధాల్లో (కర్ణాటక యుద్ధాలు) పాలుపంచుకున్నాడు. ఈ సమయంలోనే కర్నూలు ప్రకృతి వైపరీత్యాలకు గురై.. ఇక్కడి కోట కొంత దెబ్బ తింది.
1741లో మరాఠాల విజృంభణ కొనసాగినప్పుడు ఈ పట్టణం వారి చేతికొచ్చింది.
1751లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ ఫిరంగులతో కోటను బద్దలుకొట్టి కర్నూలును ముట్టడించి, స్వాధీన పరచుకోగా, 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని జయించాడు.
1799 లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా, నాడు ఈ జిల్లా అంతా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది.
బీదరు, బీజాపూరు, అహ్మద్ నగర్ నవాబులు గోల్కొండ మీదికి దండెత్తి రాకుండా ఉండేందుకు.. 1800లో నాటి నిజాం.. సైన్య సహకార పద్ధతి ఒప్పందం మీద సంతకం పెట్టాడు. దీని ప్రకారం.. హైదరాబాద్ మీదికి ఎవరు దండెత్తినా.. వారిని నిజాం సేనలు, బ్రిటిష్ సేనలు కలిసి ఎదుర్కొంటాయి. దానికి బదులు.. నిజాం నవాబు.. నేటి రాయలసీమను బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు. నేటి నాలుగు జిల్లాల రాయలసీమను నాడు బ్రిటిషర్లు సీడెడ్ జిల్లాలు అని పిలిచారు.
1823 – 1839 సమయంలో బ్రిటిషర్లు నియమించిన రసూల్ ఖాన్ కోటపై ఉన్న మక్కువతో దీనికి మరమ్మతు చేయించాడు. అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ రసూల్ ఖాన్ను తొలగించి 1947 వరకూ తమ ఆధీనంలోనే ఉంచుకుంది.
1947 తర్వాత ఇది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమై, 1953లో ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ఉంటూ.. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో భాగమైంది.
1830లో చెన్నై నుంచి కాశీకి యాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య తన ప్రయాణంలో బసచేసిన ఈ ప్రాంత విశేషాలను తన యాత్రాచరిత్రలో నమోదుచేశాడు. ఈ ప్రాంతంలో ఆవుల పాలను కేవలం దూడలకే వదిలే వారనీ, ఒక్క చుక్క కూడా మనుషులు తాగేవారు కాదని వివరించారు. కడప దాటిన తర్వాత వచ్చిన ఈ ప్రాంతం దాటి.. తిరిగి శ్రీశైలం చేరిన తర్వాతే.. తాను ఆవుపాలు తాగానని, ఇక్కడి ప్రజల పశుపోషణ ఎంతో గొప్పదని ఆయన తన పుస్తకంలో ప్రశంసించారు.
కర్నూలు కోటను నాటి విజయనగర పాలకుడైన అచ్యుతదేవరాయలు నిర్మించాడు. ఈ కోటకు నాలుగువైపులా నిర్మించిన బురుజుల్లో మూడు శిధిలం కాగా, మిగిలిన నాలుగవ బురుజునే నేడు మనం కొండారెడ్డి బురుజు అని పిలుస్తున్నాం. ఇది విజయనగర పాలకుల వీరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నేటికీ నిలిచి ఉంది.