Mahadev Betting : నవంబర్ 7.. చత్తీస్గఢ్లో పోలింగ్ జరిగే రోజు. సరిగ్గా ఇంకా నాలుగు రోజులే ఉంది. ఈ సమయంలో సిట్టింగ్ సీఎం భూపేష్ బాఘేల్ను ఇరుకున పెట్టే విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ క్లీన్ ఇమేజ్కు కేరాఫ్గా నిలిచిన భూపేష్ పేరును మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారన్న సంచలన విషయం వెలుగులోకి తీసుకొచ్చింది ఈడీ. కొద్ది రోజులుగా చత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి హస్తమే ఉందని ఈడీ ప్రకటించడంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.
అయితే సీఎం భూపేష్పై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఖండించింది. చత్తీస్గఢ్లో ఓటమి ఖాయం కావడంతోనే ఈ కుట్రకు తెరలేపారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ కుట్రే అంటూ భూపేష్ను వెనకేసుకొచ్చింది కాంగ్రెస్. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుగా పెట్టుకొని గెలవాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు హస్తం నేతలు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చత్తీస్గఢ్లో మళ్లీ కాంగ్రెస్దే హవా కొనసాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. 2000వ సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడగా.. 2003లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరిగాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే జోరు. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి రమణ్ సింగే ఏకైక ముఖ్యమంత్రి. కానీ 2018లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలతో సాధించి బీజేపీకి దారుణ పరాభవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అధికారం కాంగ్రెస్దే అన్న ప్రచారం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో భూపేష్పై వచ్చిన ఈ ఆరోపణలు ఎంత వరకు నిజం? ఈ అంశంపై ఓటింగ్పై ఎంత మేరకు ప్రభావం చూపుతుంది? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.