IPL Auction : ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని తొలిసారి విదేశాల్లో నిర్వహించనున్నారు. శుక్రవారం దుబాయ్ని వేదికగా బీసీసీఐ ఖరారు చేసి, సస్పెన్స్కి తెరదించింది. ఐపీఎల్ వేలం ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 19న ఎడారి నగరంలోని కోకాకోలా ఎరీనాలో ఐపీఎల్ వేలం నిర్వహించనున్నట్టు బీసీసీఐ వెల్లడించింది.
ఇంతవరకు వేలాన్ని స్వదేశంలోనే నిర్వహించగా మొదటి సారి బయట నిర్వహిస్తున్నారు. ఆ తేదీల్లో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇండియాలో హోటల్ రూమ్స్, బస, ఏర్పాట్లు కష్టమవుతున్నాయి. కాబట్టి, విదేశాల్లో నిర్వహిస్తున్నామని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
ఈ నేపథ్యంలో మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తాము ఎవరిని కొనసాగించాలని అనుకుంటున్నారో, ఎవరిని వద్దని అనుకుంటున్నారో.. ఆ ఆటగాళ్ల వివరాలను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 26 వరకు సమయం ఇచ్చారు. గత సీజన్ లో ఫ్రాంచైజీల వాల్యూ రూ.95 కోట్లు ఉండేది. ఇప్పుడు దానిని రూ.100 కోట్లకు పెంచుతూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా ఆటగాళ్లు మరింత డబ్బులు సంపాదించుకునే అవకాశం లభించింది.
అందరికన్నా ఎక్కువగా పంజాబ్ కింగ్స్ దగ్గర 12.20 కోట్లు ఉంటే, ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ. 50 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఫ్రాంచైజీల దగ్గర డబ్బులు ఇలా ఉన్నాయి…
సన్ రైజర్స్ : రూ. 6.55 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ : రూ.3.55 కోట్లు
రాజస్తాన్ రాయల్స్ : రూ. 3.55 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్ : రూ. 1.65 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : రూ.1.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : రూ. 4.45 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : రూ.1.5 కోట్లు ఉన్నాయి.
రాబోయే సీజన్లో ఆటగాళ్లకు మూడేళ్ల కాంట్రాక్ట్ ముగుస్తుందని బీసీసీఐ తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ఇకపోతే బీసీసీఐ గత ఏడాది ఇస్తాంబుల్లో వేలం నిర్వహించాలని భావించింది, కానీ ఎందుకో వెనక్కి తగ్గింది. ఇప్పుడు దుబాయ్ లో నిర్వహించాలని ఫైనల్ చేసింది. భూతల స్వర్గంగా పిలిచే దుబాయ్ లో వేలం జరగడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.