Indian Cricket Team : వన్డే వరల్డ్ కప్ 2023 సందర్భంగా ఇండియా ఆడే మ్యాచ్ల్లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును బీసీసీఐ ఇస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్కు ఈ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డు కోసం కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రేయాస్ ముగ్గురు పోటీ పడ్డారు. కానీ అవార్డును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ శ్రేయాస్కు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచకప్లో ఈ అవార్డు శ్రేయాస్కి రావడం ఇది రెండోసారి. మొదటిసారి న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అందుకున్నాడు.
గత మ్యాచ్లో రాహుల్ పేరును స్టేడియంలో లైట్ షో పెట్టి ప్రకటించగా, ఈసారి సచిన్కు ఆ అవకాశం లభించింది. అయ్యర్ మెడలో రాహుల్ పతకాన్ని వేశాడు. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, శార్దూల్ ఒకసారి, కేఎల్ రాహుల్ రెండుసార్లు బెస్ట్ ఫీల్డర్ అవార్డు గెలుచుకున్నారు.
ఇదే మ్యాచ్ లో శ్రేయాస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 56 బాల్స్ లో 82 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. బెస్ట్ ఫీల్డర్ అవార్డులపై మిగతా జట్ల సభ్యులు కూడా ఇది మంచి పరిణామం అని అంటున్నారు. తమ దేశపు క్రికెట్ బోర్డులు కూడా ఇటువంటి ప్రోత్సహకాలు ఇస్తే, ఆటగాళ్లకు మరింత ఉత్సాహంగా ఉంటుందని అంటున్నారు.
ఈ విషయమై ఇప్పటికే కొన్ని దేశాలు చర్చిస్తున్నాయని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఆటగాడికి ఈ అవార్డులు క్రెడిబులిటీగా ఉంటాయి. భవిష్యత్తులో జట్టు ఎంపికలో ఇవి కూడా ఒకొక్కసారి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్ లో రవీంద్ర జడేజా పట్టిన ముష్ఫికర్ రహీమ్ క్యాచ్ వన్డే వరల్డ్ కప్ 2023కే హైలైట్ అంటున్నారు. అప్పుడు తను గోల్డ్ మెడల్ నాదేనని నాటకీయంగా చెప్పిన మూమెంట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా క్యాచ్లు పట్టడం జట్టుకి శుభపరిణామం అని చెప్పాలి. వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియా అన్నింటా అద్భుత ప్రతిభ చూపించడంతో కప్ ఇండియాదేనని భారతీయులు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు.