Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై కేంద్ర నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టుతో మేడిగడ్డ.. మేడిపండని తేలిపోయిందని చెబుతోంది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది కాంగ్రెస్. ప్లానింగ్, డిజైన్, నిర్వహణ సరిగాలేక పోవడమే ఈ ప్రమాదానికి కారణమని.. ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్న ప్రతి ఏటా రెగ్యులర్గా జరిగే తనిఖీల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లేఖలో తెలిపింది.
అంతేగాకుండా ఇదే డిజైన్ ప్లానింగ్ తో నిర్మించిన అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు కూడా యుద్ధ ప్రాతిపదిక పరిశీలించాల్సి ఉందని లేఖలో తెలిపింది కాంగ్రెస్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆస్తి, ప్రాణస్టం నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. సుమారు 80 వేల కోట్ల డబ్బుతో ముడిపడిన అంశం కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరింది కాంగ్రెస్. బ్యారేజ్కు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత వ్యక్తులు, అధికారులపై డ్యామ్ సేఫ్టీ చట్టంలోని నిబంధనల ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది కాంగ్రెస్.
మరోవైపు కేంద్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి బట్టబయలైందంటూ ఆయన మండిపడ్డారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లేఖపై రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.