NEPAL EARTHQUAKE : నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 128 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని వారు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. భూకంపం తీవ్రత 6.4గా నమోదైందని నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. అయితే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తీవ్రతను 5.6కు తగ్గించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే దీని తీవ్రత 5.6గా అంచనా వేసింది.
భూకంప కేంద్రం, నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఈశాన్యంగా 250 మైళ్ల దూరంలో ఉన్న జజర్కోట్లో ఉందని నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంప తీవ్రతకు పలు జిల్లాలోని ఇల్లు నేలమట్టం అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంప తీవ్రతకు భారత్లోని పలు ప్రాంతాలు కంపించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పటు ఉత్తర్ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రకంపనలను వచ్చాయి. క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు, సహాయం చేసేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజన్సీలను సమీకరించినట్లు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ కార్యాలయం తెలిపింది.
జజర్కోట్ స్థానిక అధికారి హరీష్ చంద్ర శర్మ తెలిపిన వివరాల ప్రకారం జజర్కోట్ జిల్లాలో కనీసం 34 మంది మరణించారు. ఇక రుకుమ్ వెస్ట్ జిల్లాలో కనీసం 35 మంది మరణించారని పోలీసు అధికారి నమరాజ్ భట్టారాయ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ సంతాపం ప్రకటించారు.