Honour Killing : తమిళనాడులో పరువు హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. తూత్తుకుడి జిల్లాలో నవంబర్ 2న జరిగిన ఈ హత్యలు తానే చేశానంటూ యువతి తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూత్తుకుడి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన మారి సెల్వం (24), కార్తిక (20)లు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలను కోరగా.. అందుకు కార్తిక తండ్రి అంగీకరించలేదు. అందుకు కారణం సెల్వం తక్కువ కులానికి చెందినవాడు కావడమే. దాంతో మూడురోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఓ గుడిలె పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారిద్దరూ మురుగేషన్ నగర్లో కాపురం పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న కార్తిక తండ్రి ముత్తు రామలింగం ఆగ్రహంతో ఊగిపోయాడు. వారి ఆచూకీ తెలుసుకున్న రామలింగం.. ఆ జంటను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. గత అర్థరాత్రి ఐదుగురు యువకులతో కలిసి సెల్వం, కార్తికలపై కత్తులతో దాడి చేశారు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. యువతి ఒంటిపై 12, యువకుడి శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.
కార్తీక తల్లిదండ్రులపై అనుమానం ఉందని.. సెల్వం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. ముత్తు రామలింగంను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. తానే హత్య చేయించినట్లు అంగీకరించాడు. పేదవాడిని పెళ్లిచేసుకున్నందుకే తన కూతురిని చంపేసినట్లు నేరం అంగీకరించడంతో పోలీసులు అతడిని, అతనికి సహకరించిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.