Indian Cricket Team : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇప్పటివరకు ఇండియా 7 మ్యాచ్ లు ఆడి, అన్నింటా ఘన విజయం సాధించింది. అయితే అప్రతిహితంగా సాగిపోతున్న విజయాలు అభిమానులందరికీ ఆనందం ఇస్తున్నా, ఇండియన్ బ్యాటర్లు సెంచరీలు మిస్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇప్పటికి 7 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో మన బ్యాటర్లు 8 సెంచరీలు మిస్ అయ్యారు. ఇందులో విరాట్వి మూడు ఉన్నాయి. రోహిత్ రెండు, గిల్ , శ్రేయాస్ , కేఎల్ రాహుల్ తలో ఒకటి ఉన్నాయి. కోహ్లీ అతికష్టమ్మీద బంగ్లాదేశ్ మీద ఒక సెంచరీ మాత్రం చేయగలిగాడు. శ్రీలంకపై (88), ఆస్ట్రేలియాపై (85), న్యూజిలాండ్ పై (95) చేశాడు. సచిన్ సెంచరీల రికార్డ్ ను బ్రేక్ చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు.
రోహిత్ శర్మ ఆఫ్గనిస్తాన్పై సెంచరీ (131) చేశాడు. పాకిస్తాన్ పై (86), ఇంగ్లండ్ పై (87) పరుగులు చేసి రెండు సెంచరీలు చేజార్చుకున్నాడు. కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాపై (97) తృటిలో సెంచరీ కోల్పోయాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ (82), శుభ్ మన్ గిల్ (92) సెంచరీకి దగ్గర్లో అవుట్ అయిపోయారు.
దురదృష్టం ఏమిటంటే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ముగ్గురు బ్యాటర్లు కోహ్లీతో సహా సెంచరీలు చేజార్చుకున్నారు. ఇది కూడా రికార్డ్గానే చెబుతున్నారు. సెంచరీలు చేయకుండా జట్టు స్కోరు 357 ఇంతవరకు ఏ జట్టు చేయలేదు. స్కోర్ 350 దాటిన మ్యాచ్ ల్లో కనీసం ఒక బ్యాటర్ సెంచరీ చేశారు. కానీ సెంచరీలు లేకుండా భారీ స్కోర్ సాధించడం ఇదే ఫస్ట్ టైమ్.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కోసం విరాట్ కోహ్లీ పడిన పాట్లు, తర్వాత అది విమర్శల పాలు కూడా అయ్యింది. దానివల్ల నెట్ రన్ రేట్ తగ్గి టేబుల్ టాప్ లో ఉండాల్సిన ఇండియా సెకండ్ ప్లేస్ కి వెళ్లిందని సీనియర్లు కొందరు సీరియస్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఎవరూ సెంచరీ కోసం చూడటం లేదు.
తమ వ్యక్తిగత స్కోరు 80 దాటినా 90 దాటినా చూడటం లేదు. తమ ఆట ఆడుకుంటూ పోతున్నారు. రికార్డులు కోల్పోయిన వారిలో ఎక్కువ దురదృష్టవంతుడు ఎవరంటే కోహ్లీయే కనిపిస్తున్నాడు. అవే గానీ సెంచరీలైతే ఈపాటికి ప్రపంచంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టించేవాడు. సచిన్ రికార్డ్ కూడా దాటి వెళ్లిపోయేవాడని తెలిసి…అందరూ అయ్యో అనుకుంటున్నారు.