Election Notification : తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నోటిఫికేషన్కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపడంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ ప్రకటించడంతో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు స్వీకరించడం ప్రారంభించారు ఎన్నికల అధికారులు.
ఈ రోజు నుంచి ఈ నెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 30న పొలింగ్ నిర్వహించి వచ్చేనెల అంటే డిసెంబర్ 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
ఈసారి అభ్యర్థులు నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని.. అయితే ఆన్లైన్లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆ ప్రతిపై సంతకంచేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. తొలిరోజు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఒక్కటే అభ్యర్థులకు బీఫామ్ అందజేసింది.