Boston Tea Party : అవి బ్రిటిష్ వారు అమెరికాను పాలిస్తున్న రోజులు. పన్నులు వసూలు చేయడమే తప్పించి, పరిపాలనలో అమెరికన్లకు ఎలాంటి భాగస్వామ్యమూ లేని పరిస్థితి.
ముఖ్యంగా.. అమెరికన్లు పండించే తేయాకుకు తగిన ధర లభించకపోవటం, టీ వ్యాపారం అంతా బ్రిటిషర్ల చేతిలోనే ఉండటంతో అమెరికన్ టీ వ్యాపారులు నష్టపోతున్న సందర్భం.
ఈ విషయంలో తమకు న్యాయం చేసేవరకు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కట్టకూడదని అమెరికన్లు నిర్ణయించుకున్నారు.
దీంతో మండిపడిన బ్రిటిష్ పాలకులు.. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేసి.. అమెరికన్ల మీద ఒత్తిడి పెంచారు. కొత్త చట్టంతో టీ వ్యాపారం మీద గుత్తాధిపత్యం సాధించారు.
దీనిపై ఏదో ఒకటి తేల్చుకోవాలని అటు అమెరికన్లు కూడా నిర్ణయించుకున్నారు. ఈ ఘర్షణ వాతావరణాన్ని గమనించిన ‘సన్స్ ఆఫ్ లిబర్టీ’ అనే సంస్థ సభ్యులు స్థానిక అమెరికన్ల మాదిరిగా దుస్తులు ధరించి బోస్టన్ ఓడరేవుపై దండెత్తారు.
ఓడల్లో దించటానికి సిద్ధంగా ఉన్న టన్నులకొద్దీ తేయాకు మూటలను సముద్రంలో విసిరి పారేశారు. ఊహించని ఈ ఘటనతో బ్రిటిషర్లు బిత్తరపోయారు.
వెంటనే బోస్టన్ ఓడరేవును మూసేసి, మాసాచూసెట్స్ ప్రాంతమంతా నిర్బంధ చట్టాలను అమలుచేశారు.
తమ తేయాకును నీట ముంచినవారు నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ.. ఓడరేవులో విప్లవకారుల విజయం దేశమంతా పాకిపోవటంతో వెనక్కి తగ్గారు.
బోస్టన్ ఓడరేవులో ఆంగ్లేయుల అహంకారాన్ని అణచివేసిన ఈ ఘటన.. స్థానిక అమెరికన్లలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది. దీంతో అప్పటివరకు చప్పగా సాగుతున్న స్వాతంత్ర్యపోరాటం ఉప్పెనగా మారింది.
1773 డిసెంబర్ 16న జరిగిన ఈ సంఘటన చరిత్ర పుటల్లో ‘బోస్టన్ టీ పార్టీ’గా స్థిరపడిపోయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు పదేండ్లకు 1783లో అమెరికా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
నేడు ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికాకు నాడు స్వేచ్ఛను ప్రసాదించటంలో తేయాకు కీలక పాత్ర వహించిందంటే వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మాల్సిందే మరి.