Waqf Board : వాళ్ల కడుపు మండింది. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడంతో మంట రేగింది. ఇక ఏ మాత్రం తగ్గేది లేదని.. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఏకంగా సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో వారిద్దరి ఓటమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
నిజామాబాద్ పసుపు రైతుల వ్యూహం అమలు చేసేందుకు రెడీ అయ్యారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వక్ఫ్ బోర్డు బాధితులు. నిజామాబాద్లో కవితను ఎలా ఓడించారో.. ఇప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిని కూడా అలాగే ఓడిస్తామంటున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాలతో పాటు, మంత్రి మల్లారెడ్డిపై వందలాది నామినేషన్లు వేయడానికి రెడీ అయ్యారు వక్ఫ్ బోర్డ్ బాధితులు.
జేఏసీ ఆధ్వర్యంలో బోడుప్పల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్, కామారెడ్డి, మేడ్చల్ నియాజక వర్గాల్లో ఒక్కో చోట రెండు వందలకు పైగా నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. తమ ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమంటున్నారు బాధితులు..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి. గత 30 ఏళ్ల నుంచి అక్కడే నివాసముంటున్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు తీసుకున్నారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలు కూడా పొందారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారిపై పిడుగు పడినంత పని అయ్యింది. వాళ్లు నివాసముండే భూమి వక్ఫ్ బోర్డుకి సంబంధించిందని షాక్ ఇచ్చింది సర్కార్. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.
2018ఎన్నికల్లో వక్ఫ్ పేరును తొలగిస్తాననే హామితో మంత్రి మల్లారెడ్డి గెలిచారని ఆ తర్వాత మాట తప్పారని ఫైర్ అవుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ దెబ్బ చూపించడానికి సిద్ధపడ్డారు బాధితులు.
గత ఎన్నికల్లో మాట తప్పిన మల్లారెడ్డి.. మళ్లీ అబద్ధపు ప్రచారంతో తమ దగ్గరకు వస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో మల్లారెడ్డి, కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని, వారిపై ఒక్కో నియోజకవర్గంలో రెండు వందలకు పైగా నామినేషన్లు వేస్తామని చెప్పారు. మరోవైపు బోడుప్పల్ వక్ఫ్ బోర్డ్ బాధితులకు మద్దతు కూడా భారీగా పెరుగుతోంది. వీరికి ఘట్కేసర్, కుత్బుల్లాపూర్కు చెందిన మరో 5వందలకు పైగా కుటుంబాలు.. సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ ఇష్యూ ఎంత పెద్దది కాబోతుందనేది ఆసక్తిగా మారింది.