World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికా ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఒకట్రెండు తప్ప ఆడిన అన్ని మ్యాచ్ ల్లో 350 పైనే స్కోర్ కొట్టడం, వీరిని చూసి ఆస్ట్రేలియా రెచ్చిపోవడం చూస్తుంటే, వచ్చే మ్యాచుల్లో రచ్చ మామూలుగా ఉండదని నెటిజన్లు అంటున్నారు.
ఈ రెండు జట్ల వాలకం చూస్తుంటే ఒకవేళ సెమీఫైనల్ లోగానీ వీరు ఇలాగే ఆడితే ఇండియా పరిస్థితేమిటి? అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా పెర్ ఫార్మెన్స్ ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. దురదృష్టం ఏమిటంటే వారు ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ కొట్టలేదు. ఎప్పుడూ లీగ్ మ్యాచ్ ల్లో ఇరగదీయడం, నాకౌట్ లో పడుకుండిపోవడం వారి ఫిలాసఫీగా మారిపోయింది. కానీ ఈసారి చూస్తుంటే, దాన్ని తిరగరాసేలా కనిపిస్తోంది. ఒకసారి 2023 వన్డే వరల్డ్ కప్ లో వారి చేసిన స్కోర్లు చూస్తే కళ్లు తిరగక మానవు.
తాజాగా జరిగిన న్యూజిలాండ్ లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేశారు. వారిని 167 పరుగులకే ఆలౌట్ చేశారు.
శ్రీలంక మీద 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేశారు. ఆ మ్యాచ్ లో ఏకంగా ముగ్గురు సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 177 పరుగులకే వారిని ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ మీద 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వారిని 170 పరుగులకు ఆలౌట్ చేసింది. బంగ్లాదేశ్ మీద 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. వారిని 233 పరుగులకు ఆలౌట్ చేసింది. ఎటొచ్చి పాకిస్తాన్ పై మాత్రం చెమటోడ్చి నెగ్గింది. అది కూడా అంపైర్ దయతో గెలిచిందనే విమర్శలు వచ్చాయి. పిల్లకాకి జట్టు నెదర్లాండ్స్ చేతిలో మాత్రం ఘోరంగా ఓటమి పాలైంది.
ఇండియా విషయానికి వస్తే.. మనవాళ్లు గెలుస్తున్నారు గానీ, తాపీగా గెలుస్తున్నారు. అంటే అన్నీ ఛేజింగ్ లు కావడంతో భారీ స్కోర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఇంగ్లండ్ తో ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చి బొక్కబోర్లా పడ్డారు. బౌలర్ల దయతో ఆ మ్యాచ్ గెలిచి గండం గడిచింది.
వరల్డ్ కప్ లో మొదట స్లోగా ఆడినా, తర్వాత ఆస్ట్రేలియా కూడా దుమ్మురేపుతోంది. చివరి మూడు మ్యాచ్ లు కూడా 300పైనే స్కోర్లు సాధించింది. పాకిస్తాన్ మీద 367, న్యూజిలాండ్ మీద 383, నెదర్లాండ్ మీద 399 పరుగులు చేసింది.
ఇప్పుడు వీరు చాకిరేవు బాగానే పెడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇండియా స్పీడ్ పెంచాల్సిందే. రేపు నాకౌట్ మ్యాచ్ ల్లో సూర్యకుమార్, శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, హార్దిక్ అందరూ బలంగా ఆడకపోతే.. ఇక్కట్లు తప్పవని అంటున్నారు. కాకపోతే షమీ రాకతో బౌలింగ్ విభాగం పటిష్టమైంది. అందువల్ల ఆ జట్లకి అంత స్కోరు రాదని కొందరు చెబుతున్నారు.