Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రాహుల్ కలియ తిరిగారు. ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆరా తీశారు. పోలీసులు బ్యారేజ్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు విధించిన తర్వాతే రాహుల్ గాంధీని ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి ఇచ్చారు.
రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిసి అక్కడకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. పోలీసులు వారిని చెక్ పోస్ట్ దగ్గర అడ్డుకున్నారు. అయితే భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లు దాటుకుని బ్యారేజ్ దగ్గరకు వెళ్లారు. వారిని నిలువరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ బీఆర్ఎస్ సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు నేపథ్యంలో.. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా అంబటిపల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారిక సభలో పాల్గొన్న రాహుల్ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.