GV Vennela : రానున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగనున్న యువ అభ్యర్థుల పేర్లలో డా. జీవీ వెన్నెల పేరు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తోంది.
గద్దర్ కుమార్తెగా ఇటీవలి కాలంలో జనానికి తెలిసిన ఆమె.. తన తండ్రి ఆఖరి కోరికను తీర్చేందుకు, ఆయన రాజకీయ వారసురాలిగా జనం ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ.. సీనియర్లను కాదని మరీ, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.
ఇన్నాళ్లుగా.. గద్దర్ వారసురాలిగా ఎక్కడా తన ఉనికిని బయటపెట్టుకోకుండా, తనకు తానుగా తన కాళ్లమీద నిలబడాలనే సంకల్పంతో డా. వెన్నెల తన జీవితాన్ని కొనసాగించారు.
వెన్నెల విద్యాభ్యాసం అనేక ప్రాంతాల్లో సాగింది. టెన్త్ సెంట్ ఆన్స్ హైస్కూల్ లో పూర్తి చేశారు. గద్దర్ సంక్షోభ కాలంలో.. ఆయన వామపక్ష మిత్రులు ఆయన కుమార్తె వెన్నెలను ప్రముఖ సినీనటుడు.. మోహన్ బాబు రంగంపేటలో స్థాపించిన శ్రీవిద్యానికేతన్లో చేర్పించారు. అక్కడ ఆమె ఇంటర్ (MPC) చదివారు.
ఈ కాలంలో గద్దర్ అల్వాల్ భూదేవి నగర్లో, మాజీ ఐఏఎస్ శంకరన్ వంటి వారితో కలిసి మహాబోధి అనే పాఠశాలను ప్రారంభించారు. ఈ బడిలో ఇప్పటివరకు 12 వేల మంది విద్యార్థులు చదువుకున్నారు.
శ్రీవిద్యానికేతన్లో ఇంటర్ చదివే రోజుల్లోనే సెలవులకు ఇంటికి వచ్చే వెన్నెల.. తమ స్కూల్లో విద్యార్థులకు కంప్యూటర్ క్లాసులు చెప్పేది.
ఉస్మానియాలో డిగ్రీ, పీజీ చేశారు వెన్నెల. అక్కడ మహిళా సాధికారతపై పీహెచ్ డీ చేశారు. అలాగే ఇగ్నో స్కూల్ లీడర్ షిఫ్ , మేనేజ్ మెంట్ పై మరో పీజీ చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో వెలుగు పథకంలో చిరుద్యోగిగానూ పనిచేశారు. మహిళల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన అనే లక్ష్యంతో ఆరంభించిన ఈ ప్రాజెక్టు కోసం పనిచేసే రోజుల్లోనే.. ఆమె సమాజంలో మహిళల ఇక్కట్లను దూరం చేయాలని నిర్ణయించుకున్నారు.
2010 నుంచి 2017 వరకు అదే స్కూలులో.. 7 ఏళ్లపాటు రూపాయి వేతనం లేకుండా స్కూలు టీచరుగా పనిచేశారు.
2017లో పీహెచ్డీ పుచ్చుకున్నారు. అదే స్కూలు ప్రిన్సిపాల్గా కొంత గౌరవ వేతనం తీసుకుంటూ పనిచేస్తూ వచ్చారు.
తన పాఠశాలలో మహిళా టీచర్లకు అవకాశమిస్తూ, చదువుకొనేందుకు నగరానికి వచ్చేవారికి పాఠాలు చెప్పే అవకాశం కల్పిస్తూనే టీచరుగా కొనసాగేలా చొరవచూపుతున్నారు.
ప్రస్తుతం తండ్రి ఆశయాల మేరకు ఈ విద్యాసంస్థను మరింత విస్తరించే ప్రయత్నంలో వెన్నెల ఉండగానే గద్దర్ కన్నుమూశారు.
జీవితపు చివరి రోజుల్లో తన తండ్రి కాంగ్రెస్కు సంఘీభావం ప్రకటించి, ఆ పార్టీ నుంచి పోటీచేయాలని భావించిన కారణంగా, ఆమె ఆయన వదిలి వెళ్లిన బాధ్యతను ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజాయుద్ధనౌకగా జనం బాధలను తన బాధలుగా భావించిర గద్దర్ ఆశయాలను ప్రజాస్వామిక విధానంలో, ప్రజాసేవ చేసేందుకు ఆమె ముందుకు రాగా, కులమత, వర్గాలకు అతీతంగా, అందరూ ఆమెను ఆహ్వానించారు.
అటు.. ఇదే సెగ్మెంట్లో తండ్రి, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మరణించటం, ఈ సీటును గులాబీపార్టీ ఆయన కుమార్తె లాస్యా నందితకు కేటాయించటంతో ఆమె కూడా తొలిసారి ఇక్కడ పోటీచేస్తున్నారు.
ఏది ఏమైనా.. ఇద్దరు విద్యాధికులైన ఇద్దరు యువతులు, ఒకేసారి, ఒకే నియోజక వర్గం నుంచి తమతమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో కంటోన్మెంట్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.