Nara Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
చంద్రబాబు వస్తున్నారనే వార్త తెలియగానే బేగంపేట విమానాశ్రయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. కొంతమంది ఐటీ ఉద్యోగులు అక్కడకి తరలివచ్చారు. జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. “బాబుతో నేను” అనే స్లోగన్ తో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు మహిళలు వచ్చి చంద్రబాబుకు స్వాగతం చెప్పారు.
కోర్టు షరతులు ఉండటం వల్ల చంద్రబాబు మీడియాతో మాట్లాడలేదు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి కారులో ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణాల వల్ల హైకోర్టు చంద్రబాబుకు మధ్యతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన కంటికి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది.