Telangana Elections : తెలంగాణ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటూ రోజుకో నిర్ణయం ప్రకటిస్తూ బిజీబిజీగా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు దాదాపు అరడజను ప్రధాన రాజకీయ పార్టీలు. వీటిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముందువరుసలో ఉండగా.. కమ్యూనిస్టుల పార్టీలైన సీపిఐ, సీపిఎంలు కూడా తమ ఉనికి చాటుకునేందుకు ఎన్నికల బరిలో దిగుతున్నాయి.
అయితే ఈ కమ్యూనిస్టు పార్టీలు సెక్యులర్ భావజాలం ఉన్న సైద్ధాంతిక పార్టీలు. అందుకే మతం, కులం ప్రాతిపదికన ఉండే బీజేపీ, ఎంఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకోలేవు. అందువల్ల వీరికి మిగిలింది కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే. అందుకే ముందుగా బీఆర్ఎస్తో పొత్తుపై ఆశలు పెట్టుకున్న కామ్రేడ్లు.. గులాబీ బాస్ కేసీఆర్ పిలుపుకోసం ఎదురుచూసి చూసి భంగపడ్డారు.
ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలిచాయి. ఆ సమయంలో కేసీఆర్ వారికి అసెంబ్లీ ఎన్నికలకు కలిసి పనిచేద్దామనే మాట ఇచ్చారు. రాజకీయాలలో కేసీఆర్ మాట మీద ఎంతవరకు నిలబడతారో మన అందరికీ తెలుసు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం అప్పుడు సోనియా గాంధీతో.. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ మాట ఇచ్చి తప్పిన ఘనచరిత్ర కేసీఆర్ది.
అలా అవసరం తీరిపోయాక సోనియాగాంధీనే లెక్కచేయని కేసీఆర్.. కామ్రేడ్లకు మాత్రం న్యాయం చేస్తారని ఆశించడం తెలివితక్కువపనే అవుతుంది. కేసీఆర్ చేతిలో మోసపోయిన తరువాత కమ్యూనిస్టు పార్టీలకు ఇక మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్. దీంతో కామ్రేడ్లు కాంగ్రెస్తో పొత్తు కోసం చర్చలు మొదలుపెట్టారు. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, బీఆర్ఎస్ నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో వలస వచ్చారు. దీంతో ఆ పార్టీ టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు అడిగిన ప్రాంతాలలో టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్కు కష్టతరంగా మారింది. దీంతో ఇప్పుడు తప్పని సరి పరిస్థితిలో కమ్యూనిస్టులు ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు. ఇందులోనూ సీపీఎం,సీపీఐలు ఎవరికి వారుగా పోటీ పడుతుండడం గమనార్హం.
ఈ క్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లాలో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. సత్తుపల్లి మినహా ఖమ్మం, వైరా, మధిర, పాలేరులో సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపేందుకు జిల్లా కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అభ్యర్థులతో పాటు నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కీలకమైన పాలేరు నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధపడుతున్నారు.
ఇప్పటికే పాలేరులోని నాలుగు మండలాల్లో ఆయా మండల కమిటీల సమావేశాలు జరిగాయి. ఇక పాలేరు, ఖమ్మం లాంటి ప్రతిష్టాత్మకమైన జనరల్ స్థానాల్లో సీపీఎం రాష్ట్ర స్థాయిలోని ముఖ్యనాయకులు పోటీ చేస్తే పార్టీకి పటిష్ఠమైన ఓటు బ్యాంకు దక్కుతుందని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు కీలక నేతల అన్వేషణ సాగుతోంది.
మరోవైపు సీపీఐ కూడా ఇల్లెందు, సత్తుపల్లిలో ఒంటరి పోరుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. సొంత బలంతో పోటీకి దిగడంతో ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎంతనేది ఈ ఎన్నికలతో తేలిపోతుందని పరిశీలకులు అంటున్నారు.
అయితే.. ఈ ఒంటరి పోరుతో కమ్యూనిస్టులకు ఎంత లాభం జరుగుతుందనే మాట అటుంచితే.. ప్రధానపార్టీల ఓట్లు చీల్చడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
.