Telangana election update(Political news in telangana):
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నామినేషన్లకు కౌంట్ డౌన్ కొనసాగుతుండటంతో ఆర్వో ఆఫీసుల వద్ద శాంతి భద్రతలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టినుంది. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు.. నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల మూడు నుంచి 10 వరకు రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ప్రతీ నియోజకవర్గానికో నామినేషన్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. నామినేషన్ వేయడానికి అభ్యర్థులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది కాబట్టి.. భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో నామినేషన్ కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించి భద్రతను పర్యవేక్షించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఎన్నికల నిర్వహణపై సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలతో కమిషనర్లు మీటింగ్ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు సీపీలు. అంతేకాదు ర్యాలీలు, మీటింగ్స్ పెట్టేవారు తప్పకుండా పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్ వద్ద పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా డబ్బు, మద్యం, ఓటర్లను మభ్య పెట్టే ఇతర వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్లో 15 నామినేషన్ కేంద్రాలు, రాచకొండలో 8, సైబరాబాద్ లో 6 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాచకొండలో ఉన్న 3 వేల 326 పోలింగ్ స్టేషన్ల పై పోలీసు శాఖ నిఘా పెట్టింది. 19 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గానికి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. అంతేకాదు నామినేషన్ కేంద్రాల వద్ద లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా బందోబస్తులో ఉంటాయని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.