కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ఇంకా పూర్తి స్పష్టత రాకుండానే.. మరో ఫెయిల్యూర్ బయటపడింది. మేడిగడ్డ ఘటనపై ఇంకా ఇష్యూ జరుగుతుండగానే.. మరో ఘటన వెలుగుచూసింది. అన్నారం బ్యారేజ్ కింది నుంచి దిగువకు భారీగా నీరు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు. 18, 19, 20, 48 గేట్ల వద్ద పైపింగ్ ఫెయిల్యూర్ జరిగినట్లు గుర్తించారు. బ్యారేజ్ బేస్ మెంట్ కింది నుంచి నీళ్లు లీకవుతున్నాయి. ఈ లీకేజీ పెరిగితే బ్యారేజ్ కుంగిపోయే ప్రమాదం ఉండటంతో.. ఇరిగేషన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అన్నారం బ్యారేజ్ డ్యామేజ్ ను పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా.. 1.2 కిలోమీటర్ల పొడవున 66 గేట్లతో అన్నారం సరస్వతి బ్యారేజ్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్టులో నిర్మించిన మూడు బ్యారేజీల్లో అన్నారం ఒకటి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద బ్యారేజ్ ను నిర్మించారు. తాగు, సాగునీరు కోసం నిర్మించిన ఈ బ్యారేజ్లో మొత్తం 66 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యారేజ్లో మొత్తం 11.9 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 2016లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా.. 2019లో ఆయనే ప్రారంభించారు.
గతేడాది వచ్చిన వరదల్లోనే ఇక్కడి డిజైన్ లో లోపాలు బయటపడ్డాయి. వరదల కారణంగా ఇక్కడి పంపుహౌస్ పూర్తిగా నీటమునిగి అందులోని పరికరాలు దెబ్బతిన్నాయి. ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 మోటార్లు.. నీటమునగడంతో ప్యానల్ బోర్డ్, స్విచ్ గేర్ పరికరాలు పనికి రాకుండా పోయాయి. ఆ తర్వాత మోటర్ల విడి భాగాలను విప్పి, ఆరబెట్టి.. ఒక్కో మోటార్ను ఫిక్స్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడే కాదు.. అక్టోబర్ 9, 2019న కూడా అన్నారం బ్యారేజీ గేట్లు లీకయ్యాయి. కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని నాడు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడంతో గేట్లకు రిపేర్లు చేయించారు. అంతేకాదు అన్నారం పంప్హౌజ్ నుంచి నీటి సరఫరా చేసే పైప్లైన్ 2021 జూలై 28న భారీ వర్షాలకు భూమిలో నుంచి పైకి లేచింది.
వారంరోజుల క్రితమే మేడిగడ్డ కుంగుబాటుకు గురవ్వగా.. ఇప్పుడు అన్నారం సరస్వతి బ్యారేజ్ లోనూ లోపం తలెత్తడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటోంది. వరుసగా బ్యారేజీల డ్యామేజ్ లు బయటపడుతుండటంతో ప్రతిపక్షాలు రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.