Rajashyamala Yagam : ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం చేస్తున్నారు. గజ్వేల్లోని తన వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామి పర్యవేక్షణలో బుధవారం తెల్లవారుజామున యాగం మొదలైంది. ఈ యాగంలో సుమారు 200 మంది వైదికులు పాల్గొంటున్నారు. బుధవారం సంకల్పం, రేపు వేద పారాయణాలు, హోమం ఉంటుంది. చివరిరోజు పూర్ణాహుతితో రాజశ్యామల యాగం ముగుస్తుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సత్తుపల్లి, ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలు పాల్గొనాల్సి ఉంది. మరి రాజశ్యామల యాగం మొదలుపెట్టిన నేపథ్యంలో అది ముగిసేవరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటారా? ఎన్నికల పర్యటనలు కంటిన్యూ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఒక వేళ యాగం నిమిత్తం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైతే.. కేటీఆర్ ప్రచారపర్వం మొదలవుతుందా అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి గెలుపుకోసం కేసీఆర్ రాజశ్యామల యాగం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు.