తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అన్ని పార్టీలకంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ముమ్మర ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు క్షేత్రస్థాయిలో ఊహించని షాక్లు తగులుతున్నాయి. ప్రచారానికి వెళ్తున్న నేతలను.. తమ గ్రామాలకు రావద్దంటూ స్థానికుల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. మంచిర్యాల, చేవెళ్ళ, సత్తుపల్లి, వర్ధన్నపేట, జహీరాబాద్ సహా పలు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తు వారిని నిలదీసి వెనక్కి పంపారు.
మరోవైపు మండల స్థాయిలో కూడా పార్టీ నేతల నుంచి చేదుఅనుభవం ఎదురవుతుంది. దీంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితి నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందడంలేదని కొందరు.. మమ్మల్ని కావాలని పక్కన పెట్టారని కొందరు ఇలా నేతలకు నిరసనలు ఎదురవుతున్నాయి. గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా కనిపించని నాయకులు..మళ్లీ ఎన్నికలు వచ్చాయని ఏ మోహం పెట్టుకుని వస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేలా మండల, గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టాలంటూ స్థానిక పార్టీ నేతలకు అభ్యర్థులు సూచింస్తున్నారు. కానీ.. ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక సమావేశాల ఏర్పాటుకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా BRS పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ నిరసనలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలకు కమిషన్ తీసుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొందనేది ఒక కారణమైతే.. అర్హులైన లబ్దిదారులకు కాకుండా.. పార్టీ కార్యకర్తలకు, నాయకుల అనుచరులకు మాత్రమే ఇప్పించుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతుండటంతో.. ప్రజలకు సర్దిచెప్పుకోవడంలో అటు అభ్యర్థులకు, ఇటు స్థానిక గులాబీ లీడర్లకు సవాలుగా మారింది.
కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తొమ్మిదేళ్ల ప్రగతి పథమే తమను గెలిపిస్తుందని BRS పార్టీ అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే.. క్షేత్రస్థాయికి వెళ్తేగాని వారికి అర్థంకాలేదు. ఈసారి తాము గట్టెక్కడం కష్టమేనని. దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, పెన్షన్లు వంటివి అందకపోవడం.. అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తూ స్థానికంగా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
ఎన్నికల గడువు ముంచుకొస్తుంది.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేలా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్తున్నా.. స్థానిక లీడర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. దీనికి తోడు ఇన్చార్జిలకు, అభ్యర్థులకు మధ్య కూడా గ్యాప్ పెరగడంతో అధిష్టానికి మరింత తలనొప్పిగా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయం రోజు రోజుకు రక్తి కడుతోంది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ఇప్పటి వరకు తమ ఎన్నికల ప్రచారంలో రైతులు, కరెంట్, నిరుద్యోగులు వంటి అంశాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. దుబ్బాక ఇన్సిడెంట్తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు దుబ్బాక ఘటన చుట్టూ తిరుగుతోంది. ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఇది తనపై జరిగిన దాడిగా చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన కాంగ్రెస్, బీజేపీ.. ఘటనను ఖండిస్తూనే సానుభూతి రాజకీయాలు మానుకోవాలని అధికార పార్టీపై రివర్స్ ఎటాక్ ప్రారంభించాయి. దీంతో తెలంగాణలో రాజకీయం కత్తిపోటు చుట్టూ తిరుగుతోంది.
కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి జరగడంతో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచారు. ఇప్పుడు వారికి ఉన్న గన్మన్ల సంఖ్యను 2 ప్లస్2, 3 ప్లస్ 3 నుంచి 4 ప్లస్4కు పెంచారు. అయితే.. ఇంటెలిజెన్స్అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎక్కడా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత పెంపు అనే అంశం లేదు. సెక్యూరిటీ పెంపులో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వైపే మొగ్గు చూపి.. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.